ఏపీలో మరో ఎన్నికల సమరం : సీఎం జగన్ కసరత్తు షురూ : 9 జిల్లాల్లో పబ్లిక్ పల్స్ పై క్లారిటీ..!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందే మరో ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. అసెంబ్లీ పోరుకు ముందే పబ్లిక్ పల్స్ తెలసుకొనేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల నేతల రాష్ట్ర పర్యటనల నడుమ..మరో ఎన్నికల సమరానికి సై అంటున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. ప్రస్తుత ఏపీ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలుగా ఉన్న ముగ్గురికి పదవీ కాలం రానున్న మార్చ్ 29వ తేదీతో ముగియనుంది. ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ముగ్గురు తొమ్మది నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ప్రీ ఫైనల్స్.. విద్యావంతుల ఓట్లు
వారిలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్ది యందపల్లి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. అనంతపురం - కడప - కర్నూలు నుంచి వైసీపీ సభ్యుడు వెన్నుపూస గోపాల రెడ్డి గత ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బీజేపీ అభ్యర్ది మాధవ్ గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, మార్చి నెలాఖరు వరకు వీరి పదవీ కాలం ఉన్నా.. మార్చి ఆరంభంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ, ఈ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ప్రీ ఫైనల్స్ గా భావిస్తున్న సీఎం జగన్ మూడు నియోజకవర్గాల్లోనూ..అంటే తొమ్మది నియోజకవర్గాల ఓటర్ల నాడి స్పష్టం చేసేవి కావటంతో ఇప్పటి నుంచే అప్రమత్తం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్లతో జరిగే ఎన్నికలు కావటంతో.. ఇప్పటి వరకు విద్యా వంతులు - అర్బన్ ఏరియా ల్లో వైసీపీ బలహీనంగా ఉందనే ప్రతిపక్షాల ప్రచారానికి గెలుపుతో సమాధానం చెప్పాలని సీఎం జగన్ లక్ష్యంగా డిసైడ్ అయ్యారు.

తొమ్మిది జిల్లాల్లో ప్రజాభిప్రాయంపై స్పష్టత
దీంతో.. తొమ్మది ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు - ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం సీమలోని అనంతపురం - కడప - కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ గోపాలరెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన గతంలో ఉద్యోగ సంఘాల నేతగా వ్యవహరించారు. ఇక, బీజేపీ ఖాతాలో ఉన్న ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎవరిని బరిలోకి దించేదీ స్పష్టత రావాల్సి ఉంది. అదే విధంగా ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు లో సైతం మాజీ ఎమ్మెల్సీని ఒకరిని బరిలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్నిక ఏదైనా సీఎం జగన్ తొలి నుంచి సీరియస్ గానే తీసుకుంటారు. ఇందుకోసం మంత్రులు - పార్టీ ముఖ్యులకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. విద్యార్హత కలిగి.. పట్టభద్రులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో వారి తీర్పు వచ్చే ఎన్నికల పైన ప్రభావం చూపించనుంది. దీంతో..ఈ తొమ్మది జిల్లాల్లో ఓటర్లకు ఇప్పటి నుంచే దగ్గరయ్యేలా సీఎం జగన్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు.

సీఎం జగన్ కసరత్తు షురూ..ప్రతిష్ఠాత్మకం
ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి..ఓటర్ల దగ్గకు పంపేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే.. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ద్వారా ప్రజల మూడ్.. రాజకీయంగా ప్రజానాడి పైన స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ఎన్నికల మొదలు అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తున్న వైసీపీకి..ఈ ఎన్నికను సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. దీంతో..సీఎం జగన్ ఈ తొమ్మది జిల్లాల్లోని ముందుగా గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకోవటానికి ఎటువంటి వ్యూహం సిద్దం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications