ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం .. ట్రాన్స్ జెండర్ లు , అనాధలకు బియ్యం కార్డులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో వివక్షకు గురవుతూ ఒంటరిగా జీవిస్తున్న ట్రాన్స్ జెండర్ లకు అండగా నిలవడం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో వివక్షకు గురవుతున్న అనాధలు, ట్రాన్స్ జెండర్లకు, పిల్లలు లేని వితంతువులు, ఇల్లు లేని వారందరికీ బియ్యం కార్డులు అందించి వారికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో అర్హులను గుర్తించాల్సిందిగా అధికారులకు, వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
Recommended Video
సాధారణ బియ్యం కార్డు మాదిరిగానే గ్రామ వార్డు, సచివాలయంలో రైస్ కార్డుల కోసం వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. పది రోజుల్లో వారికి కొత్త రైస్ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ట్రాన్స్ జెండర్ లకు, అనాధలకు, పిల్లలు లేని వితంతువులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు బియ్యం కార్డు తీసుకునే లబ్ధిదారులు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
ఒంటరిగా ఉంటూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వారికి ప్రభుత్వం బాసటగా నిలవాలని నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అనాధల విషయంలో, ట్రాన్స్ జెండర్ల విషయంలో బియ్యం కార్డులు అందించే నిర్ణయం తీసుకున్నారు.