జగన్కు మరో షాక్: బాబు వైపు నెల్లూరు నగర మేయర్
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మరో షాక్! శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. నగర అభివృద్ధి కోసం తాను ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని నెల్లూరు నగర మేయర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అబ్దుల్ అజీజ్ తెలిపారు.
బుధవారం మేయర్ ఛాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక పార్టీ ఎమ్మెల్యేలతో ఆయనకు విభేదాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. పార్టీ మారడానికి కారణం కూడా అదేనని చెప్పారు. త్వరలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి పార్టీ మారే తేదీని ప్రకటిస్తానని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వరుసగా షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు జరగగానే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి గుడ్ బై చెప్పారు. ఇటీవల అరకు ఎంపీ కొత్తపల్లి గీత సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా, నెల్లూరు నగర మేయర్ ఝలక్ ఇవ్వడం గమనార్హం.