కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో... !
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్ లో కొనసాగిన ఆ పార్టీ నేతల హవా ఇప్పుడు కనుమరుగైంది. అంతే కాదు అప్పట్లో అధికారంతో రెచ్చిపోయిన సదరు నేతలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే క్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి కొడాలి నానికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పట్లో కేసినో నిర్వహించినా, ప్రత్యర్థులపై క్యాడర్ తో దాడులు చేయించినా అడిగేవారు లేరు. కానీ ఇప్పుడు అవే కేసుల్ని పోలీసులు వెలికితీస్తున్నారు.
గుడివాడలో వైసీపీ నేతలకు ఉచ్చు బిగిస్తోంది. టీడీపీ నేతలు, పార్టీ ఆఫీస్ లపై గతంలో వైసీపీ నేతలు చేసిన దాడుల కేసులు పోలీసులు వెలికితీస్తున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కొడాలి నాని అనుచరులైన వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించారు. ఇదే క్రమంలో రంగా వర్ధంతిలో పాల్గొనరాదని ఫోన్లో వైసీపీ నేతలు బెదిరించారు. 2022 డిసెంబరు 25న టీడీపీ ఆఫీస్ లో ఉన్న రావి, ఇతరనేతలపై కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు పాల్పడ్డారు
ఈ ఘటనలో వైసీపీ నేతలకు అప్పటి సీఐ గోవిందరాజులు కొమ్ముకాసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పోలీసులు వీడియో ఫుటేజ్ సేకరించారు. ఈ దాడుల్లో పాల్గొన్న కొడాలి నాని అనుచరులు మెరుగుమాల కాళీ, మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై ప్రస్తుతం కేసులు నమోదయ్యాయి. 149, 143, 144, 146, 188, 427, 506 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది.2022 జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీపైనా వైసీపీ నేతలు దాడులకు పాల్లడ్డారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లో అప్పటి పోలీసులు చర్యలు తీసుకోలేదు. అప్పటి కేసుల్ని వెలికితీసి ఇందులో కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications