ఏపీలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్: కొత్తగా మరిన్ని పాజిటివ్ కేసులు: ఆ జిల్లాల్లో
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ అదుపు తప్పినట్టే. రోజురోజుకూ ఈ వేరియంట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 415కు చేరింది. ఈ వేరియంట్ వల్ల ఇప్పటిదాకా మరాణాలేవీ నమోదు కాలేదు. కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాలు ఆంక్షలను విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చాయి.
ఏపీలో పెరుగుదల బాట..
ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే- ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ.. శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు. కరోనా వైరస్కే చెందిన డెల్టా, డెల్లా ప్లస్ వేరియంట్లతో పోల్చుకుంటే మూడున్నర రెట్లు వేగంగా వ్యాపించే లక్షణాలు దీనికి ఉంది. ఏపీలో తొలి పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఈ సంఖ్య మరింత పెరిగింది. భయాందోళనలకు గురి చేస్తోంది. నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలను విధించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
కొత్తగా రెండు పాజిటివ్స్..
ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఇవి వెలుగులోకి వచ్చాయి. దీని బారిన పడిన ఇద్దరూ విదేశాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారే. ఒంగోలుకు చెందిన 48 సంవత్సరాల వ్యక్తి ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి ఇంటికి వచ్చారు. అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్కు పంపించారు అధికారులు. ఒమిక్రాన్ వేరియంట్గా తేలింది.
అనంతపురం వ్యక్తికి..
అనంతపురం జిల్లాకు చెందిన 51 సంవత్సరాల వ్యక్తి బ్రిటన్ నుంచి స్వస్థలానికి వచ్చారు. ఆయనలోనూ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం వారిద్దరూ ఐసోలేషన్లో వెళ్లారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు ఒమిక్రాన్ వేరియంట్ సోకలేదని తెలిపారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లు చెప్పారు.
మొత్తం ఆరుకు..
కొత్తగా నమోదైన రెండింటితో రాష్ట్రంలో ఇప్పటిదాకా ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. తొలి కేసు విజయనగరం జిల్లాలో నమోదైన విషయం తెలిసింద. అనంతరం కెన్యా నుంచి తిరుపతికి వచ్చని ఓ విదేశీ మహిళ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి విశాఖకు వచ్చిన 33 సంవత్సరాల వ్యక్తి, కువైట్ నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని పీ గన్నవరానికి చేరుకున్న 41 సంవత్సరాల మహిళ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరికి ఈ వేరియంట్ సోకింది.
రాష్ట్రాలవారీగా..
మహారాష్ట్ర-108, ఢిల్లీ-79, గుజరాత్-43, తెలంగాణ-38, కేరళ-37, తమిళనాడు-34, కర్ణాటక-31, రాజస్థాన్-22, హర్యానా-4, ఒడిశా-4, ఆంధ్రప్రదేశ్-4, జమ్మూకాశ్మీర్-3, పశ్చిమ బెంగాల్-3, ఉత్తర ప్రదేశ్-2, చండీగఢ్-1, లఢక్-1, ఉత్తరాఖండ్-1 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఈ పరిస్థితుల్లో కొత్త సంవత్సరంలో మళ్లీ ఈ ఒమిక్రాన్ వల్ల లాక్డౌన్ తరహా పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరిలో ఒమిక్రాన్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.