జగన్ ఎనిమిదో వికెట్ డౌన్: రాను రానంటూనే టిడిపిలోకి మణిగాంధీ
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వలసలతో ఊపిరి తీసుకునే సమయం కూడా చిక్కడం లేదు. మరో శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీలోకి దూకేశాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టిడిపిలో చేరుతానని ప్రకటించిన కొద్ది గంటల్లోనే మణిగాంధీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరు శాసనసభ్యుడు మణిగాంధీ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మణిగాంధీ మాత్రం నేరుగా మంగళవారం సాయంత్రం విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఆయన బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిపోయారు. ఆయన చంద్రబాబును కలిసి టిడిపి కండువా కప్పుకున్నారు.
వైయస్ జగన్ సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన శాసనసభాపక్ష సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు గైర్భాజరయ్యారు. వారిలో కలమట, మణి గాంధీ కూడా ఉన్నారు. మరో 11 మంది జగన్కు దూరమవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మణిగాంధీ టిడిపిలో చేరడంతో టిడిపిలోకి ఫిరాయించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. వలసలను ప్రోత్సహించి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా, ఏకపక్షంగా విజయం సాధించేలా చంద్రబాబు వ్యూహరచన చేసి అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.