టి కాంగ్రెస్ అప్సెట్: విభజనపై ఆంటోనీ ఏం చెప్పింది?
విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంటోనీ కమిటీ పలు అంశాలను తన నివేదికలో పొందుపర్చింది. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్రుల ఆస్తులను తిరిగి పొందేలా ఎలాంటి చట్టాలు తేవొద్దని, హైదరాబాదు నుండి వచ్చే ఆదాయాన్ని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు పదేళ్లపాటు ఇవ్వాలని, జిహెచ్ఎంసి పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయాలని, హైదరాబాదు శాంతి పరిరక్షణ, లాండ్ ఇష్యూస్ తదితరాలు కేంద్రం నియమించనున్న కౌన్సెల్ పరిధిలో ఉండాలని నివేదికలో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది.
అంతేకాకుండా హైదరాబాదులోని విద్యా సంస్థలలో ఇప్పుడు పాటిస్తున్న పద్ధతినే మరో పదేళ్ల పాటు కొనసాగించాలని, సీమాంధ్రులకు అవకాశం ఇవ్వాలని, భద్రాచలం రెవెన్యూ డివిజన్ను సీమాంధ్రలో కలపాలని, విశాఖకు మెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలని, ఇటీవల హైదరాబాదుకు కేటాయించిన ఐటిఐఆర్ను విశాఖకు తరలించాలని, ఐఐటీలు, ఐఐఎంలు, నిట్, నిఫ్ట్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను సీమాంధ్రలో ఏర్పాటు చేయాలని నివేదికలో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు ఇంకా పలు అంశాలను పొందుపర్చారు.
అదే సమయంలో తెలంగాణ ఏర్పాటు క్లిష్టమైన సమస్య అని, దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని, తెరాస రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల సీమాంధ్రుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని, తెలంగాణలోని సీమాంధ్ర వ్యాపారస్తులు, స్థిరాస్తులున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఆంటోనీ కమిటీ సూచించిన కొన్ని అంశాల పైన టి కాంగ్రెసుతో పాటు తెలంగాణ ప్రాంత అన్ని పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపడం, హైదరాబాదు ఆదాయాన్ని పదేళ్ల పాటు ఇరు ప్రాంతాలకు ఇవ్వడం వంటి వాటిని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి లాభమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఆంటోనీ కమిటీ నివేదిక వల్ల తెరాస ఇతర పార్టీల కంటే టి కాంగ్రెసు నేతలే ఎక్కువగా అప్ సెట్ అయ్యారు. తాము చెప్పినట్లుగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో ఆంక్షలతో కూడిన తెలంగాణ అంటే ప్రజలకు ఏం సమాధానం చెబుతామని వారు ఆందోళన చెందుతున్నారు.