ఏఓబీ ఎన్కౌంటర్ వెనుక.. ఎప్పటిదీ ప్రతీకారేచ్చ!
విశాఖపట్నం : ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పోలీసులు తాజాగా జరిపిన ఎన్ కౌంటర్ లో దాదాపు 23మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. అయితే ఎన్ కౌంటర్ వెనుక 2008 నుంచి పోలీసుల్లో రగులుతోన్న ప్రతీకారేచ్చ ప్రధాన కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
2008జూన్ నెలాఖరున విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్ లో లాంచీలో ప్రయాణిస్తోన్న పోలీసులపై రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు మావోయిస్టులు. ఈ దాడిలో లాంచీ డ్రైవర్ సహా మొత్తం 38మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులను అణిచేయాలని చూస్తోన్న పోలీసు యంత్రాంగానికి ఈ దాడి మింగుడుపడలేదు.
దీంతో అప్పటినుంచి ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న పోలీసులు.. తాజా దాడి ద్వారా తమ ప్రతీకారం తర్చుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇప్పటికే పలు పోలీసు ఎన్ కౌంటర్ల నుంచి సురక్షితంగా తప్పించుకున్న ఆర్కే లాంటి మావోయిస్టు అగ్రనేత తాజా దాడిలోను తప్పించుకోవడం పోలీసులను కలవరపెడుతోన్న అంశం.
ఇదిలా ఉంటే, మావోయిస్టు అగ్రనేతలంతా ప్లీనరీల్లో ఎప్పుడు పాల్గొన్న.. వారి చుట్టూ మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. ఇందులో భాగంగానే మందుపాతరల ఏర్పాటు కూడా ఉంటుంది. అయితే తాజా ఎన్ కౌంటర్ లో ఈ భద్రతా వలయాన్ని పక్కాగా చేధించి మరీ పోలీసులు మావోయిస్టులపై ఎన్ కౌంటర్ జరిపారు. అంటే.. దీని వెనుక పోలీసులు చాలాకాలంగా పక్కా వ్యూహాలను సిద్దం చేశారని తెలుస్తోంది.
2011లో మల్కన్ గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే మల్కన్ గిరిలో ఆర్కే కదలికలు బయటపడడంతో.. మావోయిస్టులు భారీ ఎత్తున ఏదో కార్యచరణకు తెరలేపారన్న అనుమానం పోలీసుల్లో మొదలైంది. ఈ క్రమంలోనే ఏఓబీలో ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.