అమ్మ ఒడి కోతల కోసమే భారీగా టెన్త్ ఫెయిల్యూర్స్ - అయ్యన్నపాత్రుడు ట్వీట్-సాయిరెడ్డికి కౌంటర్
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ మరోసారి ముదిరింది. నిన్న ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రెండు లక్షల మంది ఫెయిల్ కావడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది.
టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి నారాయణ ప్రశ్నాపత్రాలు లీక్ చేయడమే కారణం పప్పునాయుడూ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసారు. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి డిస్టర్బ్ చేసిన పాపం మీదే అంటూ సాయిరెడ్డి మరోవ్యాఖ్య కూడా చేశారు. దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావు చదువు కొన్నవాడివి అంటూ లోకేష్ కు సాయిరెడ్డి చురకలు అంటించారు. నువ్వు రిజల్ట్స్ గురించి మాట్లాడతావా అని ప్రశ్నించారు. దీనికి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.
టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసి స్టేషన్ లో తన్నులు తిన్నా పాస్ కాని నత్తి పకోడీ రెడ్డి 2 లక్షల మంది విద్యార్థులను ఫెయిల్ చేసి 3 వేల కోట్లు అమ్మ ఒడి డబ్బు మిగుల్చుకోవాలని కన్నింగ్ ప్లాన్ వేసాడు. పనికిమాలినోడికి పదవి ఇచ్చినందుకు రిజల్ట్స్ రివర్స్ అయ్యాయి, విద్యా వ్యవస్థ నాశనం అయ్యింది. అంటూ అయన్నపాత్రుడు ఒకే ట్వీట్ లో వైఎస్ జగన్, విద్యామంత్రి బొత్సను కూడా తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఇప్పుడు సాయిరెడ్డి ట్వీట్ కు అయ్యన్నపాత్రుడు ఇచ్చిన ఘాటు కౌంటర్ వైరల్ అవుతోంది.