కరోనా:ఏపీలో మద్యం షాపుల మూసివేతకు పోరు.. చంద్రబాబు వ్యూహరచన.. క్యూ లైన్లో వ్యక్తి మృతి
లాక్డౌన్ గేట్లు పాక్షికంగా ఎత్తేయడంతో సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని నాన్ కరోనా జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో నెలన్నరగా చుక్కు దూరమైన మందుబాబులు వైన్ షాపులకు ఎగబడ్డారు. రాష్ట్రంలో ఏ మూలలోని షాపును చూసినా ఉదయం నుంచి జనం కిటకిటలాడిన దృశ్యాలు కనిపించాయి. అయితే, ధరల పట్టికలు రావడం ఆలస్యం కావడంతో మధ్యాహ్నం తర్వాతగానీ మద్యం అమ్మకాలు ప్రారంభంకాలేదు. అప్పటికే వేలాది మంది కిలోమీటర్ల మేర బారులు తీరారు.

క్యూలో వ్యక్తి మృతి..
ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో 25 శాతం రేట్లు పెంచిమరీ మద్యం అమ్మకాలు చేపట్టారు. అయినాసరే జనం భారీగా కొనుగోళ్లు చేశారు. దుకాణాలకు మదుబాబులు ముందే చేరుకున్నా, అమ్మకాలు ఆలస్యంగా మొదలుకావడంతో భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. అసలే ఎండ, పైగా గొంతు ఆరిపోయిన పరిస్థితిలో మందుబాబులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో మద్యం కోసం గంటలకొద్దీ క్యూలైన్ లో నిబడ్డ ఓ వ్యక్తి వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని పోలయ్యగా గుర్తించిన పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. వైన్ షాపుల వద్ద ఏర్పాట్లపై జనం నిలదీయడంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు..

రూల్స్ బేఖాతరు.. వైరస్ వ్యాప్తి..
రాష్ట్రంలో దాదాపు అన్ని మద్యం షాపుల వద్ద సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ బేఖాతరు కావడంతో వైరస్ మరింగా వ్యాప్తి చెందుతుందేమోననే భయాలు ఉత్పన్నమయ్యాయి. సీఎం జగన్ వైఫల్యమే ఇందుకు కారణమన్న ప్రతిపక్ష టీడీపీ.. ఏకంగా మద్యం షాపులనే మూసేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది. ‘‘45 రోజుల పాటు, డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేసిన శ్రమ అంతా, సీఎం జగన్ మద్యం పిచ్చితో, ఒక్క దెబ్బకు వెక్కిరించినట్లైంది''అని టీడీపీ మండిపడింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతోపాటు కీలక నేతలతంతా మీడియాతో మాట్లాడారు.

షాపులు మూయాల్సిందే..
కరోనా నియంత్రణ కోసం చేపట్టిన సామాజిక యజ్ఞాన్ని తుగ్లక్ జగన్ భగ్నం చేశారని, వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నవేళ లిక్కర్ షాపులు తెరిపించడమే వైసీపీ మద్యనిషేధ విధానమా? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెకన్న ప్రశ్నించారు. నిత్యావసరాలకు కేవలం 3 గంటల సమయం ఇచ్చి.. మద్యం అమ్మకాలకు మాత్రం రోజంతా అనుమతివ్వడంతోనే జగన్ డొల్లతనం బడటపడిందని, ఆఖరికి రెడ్ జోన్లలోనూ దుకాణాలు తెరిచారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలపై సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెరిచిన వైన్ షాపుల్ని వెంటనే మూసేయాలని, ఆ పని చేసేదాకా టీడీపీ ఊరుకోబోదని వెంకన్న హెచ్చరించారు.
Recommended Video

వ్యూహరచనలో బాబు..
కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ సీఎం జగన్ ను ఇరుకునపెడుతూ, విమర్శలు చేస్తోన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఇవాళ మద్యం షాపుల వద్ద సీన్లు చూసి షాకయ్యానని చెప్పారు. దుకాణాల రీఓపెనింగ్ విషయంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించిందన్న ఆయన.. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి జగనే కారకుడవుతారని హెచ్చరించారు. మద్యం దుకాణాల్ని మూసేయించే దిశగా వ్యూహరచన చేస్తోన్న చంద్రబాబు.. రోజంతా తన పార్టీ నేతలతో ఇదే విషయాన్ని మాట్లాడించారు. దీనిపై ఒకటిరెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ వెల్లడించే అవకాశముందని పార్టీ నేతలు తెలిపారు.












Click it and Unblock the Notifications