నోటుకు ఓటు: ఎపి ఎసిబి చీఫ్తో చంద్రబాబు చర్చలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ రాష్ట్ర ఎసిబి డిజీ మాలకొండయ్యతో శనివారం ఉదయం సమావేశమయ్యారు. వారిరువురి మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు సాగాయి.
శుక్రవారం రాత్రి ఎపి డిజిపి జెవి రాముడు, నిఘా విభాగం అధిపతి అనురాధలతో సమావేశమైన చంద్రబాబు శనివారం ఉదయం మాలకొండయ్యతో సమాలోచనలు జరిపారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి దర్యాప్తును ముమ్మరం చేసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో బయటపడిన ఆడియో, వీడియో సీడీలను, కేసులో నిందితులైన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను, సిసిటీవీ రికార్డులను, కంప్యూటర్ పరికరాలను విశ్లేషణ నిమిత్తం ప్రత్యేక కోర్టు ఫోరెన్సిక్ సైన్స లాబొరేటరీకి పంపించింది.
ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన వాటిలో చంద్రబాబు నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేప్ కూడా ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాత విచారణ నిమిత్తం చంద్రబాబుకు ఎసిబి సమన్లు జారీ చేయవచ్చునని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఉన్నతాధికారులతో వరుసగా సమాలోచనలు జరుపుతున్నారు. తమకు కూడా ఎసిబి ఉందని, తమకు కూడా పోలీసులు ఉన్నారని చంద్రబాబు నాయుడు పదే పదే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో తమ ఎసిబి ద్వారా ఓటు నోటు కేసులో ఏ విధమైన చర్యలు చేపట్టవచ్చునో చంద్రబాబు సమాలోచనలు జరిపినట్లు చెబుతున్నారు.