రాజస్థాన్ స్మార్ట్ సిటీ ఎక్స్పోలో...స్పెషల్ అట్రాక్షన్ గా ఎపి అమరావతి స్టాల్
అమరావతి:రాజస్థాన్ లో నిర్వహిస్తున్న స్మార్ట్ సిటీ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఎపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమరావతి స్టాల్ అక్కడి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని సిఆర్డీఎ అధికారులు తెలిపారు.
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జైపూర్ డెవల్పమెంట్ అథారిటీ, క్వాంటెలా మీడియా సంస్థల ఆధ్వర్యంలో రాజస్థాన్లోని జైపూర్ వేదికగా ఈ స్మార్ట్ సిటీ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్ పో ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పాల్గొన్నారు.
ఈ ప్రదర్శనలో ఎపి ప్రభుత్వం ఆధ్వర్యంలోని అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏఎస్ఎస్సీసీఎల్) నేతృత్వంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించిన విశేషాలతో కూడిన ఒక స్టాల్ ను ఏర్పాటుచేశారు. మిగిలిన స్టాల్స్ తో పోలీస్తే ఈ అమరావతి స్టాల్ ప్రత్యేకంగా ఉండటంతో ఇది సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోందని ఎపి అధికారులు చెబుతున్నారు.
ఈ అమరావతి స్టాల్ లో అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణ ప్రణాళిక, గవర్నమెంట్ కాంప్లెక్స్, ఐకానిక్ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టులతోపాటు సెక్రటేరియట్ టవర్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మొదలుకొని నాలుగో తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాల నమూనాలతోపాటు రహదారుల చిత్రాల నమూనాలను ప్రదర్శనకు ఉంచారు.
వీటి గురించి, వీటి ప్రత్యేకతల గురించి ఏఎస్ఎస్సీసీఎల్ అధికారులు సందర్శకులకు వివరించారు. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటీ డైరెక్టర్ వి.భవానీప్రసాద్, ప్రాజెక్ట్ మేనేజర్లు జి.ఫణికుమార్, ఆర్.దివ్యకీర్తి, మేనేజర్ కోటేశ్వరరావు, ఆర్కిటెక్ట్ కార్తీక్, కన్సల్టెంట్ మోహిత్ తదితరులు అక్కడే మకాం వేసి ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.