అసలేం జరుగుతోంది..? గర్భసంచి తొలగింపులో తెలుగు రాష్ట్రాలు టాప్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గర్భసంచి తొలగింపు(హిస్టరెక్టమీ)కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనారోగ్య సమస్యలతో కొంతమంది.. వైద్యులు ప్రలోభ పెడితే మరికొంత మంది మహిళలు గర్భసంచి తొలగింపునకు ముందుకొస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. దేశంలోని ప్రతి 100 మంది మహిళల్లో దాదాపు 5% మంది గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ) శస్త్రచికిత్సలు చేయించుకున్నారని ఓ సంచలన నివేదిక వెల్లడిస్తోంది. గర్భసంచి తొలగించుకుంటున్న వారిలో గ్రామీణ మహిళలే అధికంగా ఉన్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.
మరోవైపు గర్భసంచి తొలగిస్తే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది వైద్యులు డబ్బు కోసం పేషెంట్లను భయపెట్టి ఆపరేషన్లు చేస్తున్నారు. మరికొందరు అమాయకంగా తీయించుకుంటున్నారు. ఇంకొందరు పిల్లలు పుట్టిన తర్వాత గర్భసంచితో పని ఏమీ ఉండదని, అది తొలగిస్తేనే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నారు. దీంతో ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
తెలుగు రాష్ట్రాలు టాప్..
నివేదికలోని అంశాలు పరిశీలిస్తే.. 2019-2021 డేటా ప్రకారం మధ్య గర్భసంచిని తొలగించుకోవడంలో దేశంలో తెలుగు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయట. ఏపీలో 8.7 శాతం, తెలంగాణలో 8.2 శాతం మంది మహిళలు గర్భసంచి ఆపరేషన్లు చేయించుకున్నట్లు సమాచారం.
జాతీయ స్థాయిలో 3.3 శాతం మంది మహిళలకు గర్భసంచిని తొలగించినట్లు నివేదిక పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండున్నర రెట్లు ఎక్కువ.

ఏపీ, తెలంగాణ తర్వాత స్థానంలో 6 శాతంతో బిహార్ ఉన్నట్టు తేలింది. 40-49 ఏళ్ల వయసున్న మహిళల్లో 9.7 శాతం, 30-39 ఏళ్లున్న వారిలో 3.3 శాతం, 15 నుంచి 29 ఏళ్ల మహిళల్లో 0.2 శాతం మందికి గర్భసంచిని తొలగించినట్లు నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు గర్భసంచి లేకపోవడం వల్ల మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి, మూత్రాశయ సమస్యలు, చర్మం, జుట్టులో మార్పులు,నోరు పొడిబారడం, కంటి సమస్యలు,ఎముకల బలహీనత,గుండె సంబంధిత సమస్యలు,బరువు పెరగడం, జీవక్రియ మార్పులు.. తదితర వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications