సభలో వైసిపి అరుపులు, కేకలు: 'శుక్రవారం కదా.. జగన్ కోర్టుకెళ్లాలనేమో'
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో రెండో రోజైన శుక్రవారం నాడు కూడా కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశం కుదిపేసింది. కాల్ మనీ పైన చర్చించాల్సిందేనని ప్రతిపక్షం పట్టుబట్టడంతో సభలో గందరగోళం చెలరేగింది. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైంది. విపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
జగన్ మాట్లాడుతూ... కాల్ మనీ నిందితులు ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీలు ఫోటోలు దిగినట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. కాల్ మనీ పైన ప్రభుత్వం చర్చిస్తుందా లేక ప్రభుత్వం సమాధానం ఇస్తుందా చెప్పాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... కాల్ మనీ వ్యవహారంపై చర్చించుదామని చెప్పినప్పటికీ వారు తగ్గక పోవడం సరికాదన్నారు. వైసిపి నేతలకు ఏ కుంభకోణంతో సంబంధం లేదో చెప్పాలని వ్యాఖ్యానించారు. తొలుత క్వశ్చన్ అవర్ జరగనివ్వాలని కోరారు. కాల్ మనీ పైన అవసరమైతే రాత్రి వరకు చర్చిద్దామన్నారు.
జగన్ మాట్లాడుతూ... అంబేడ్కర్ను కూడా రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. కాల్ మనీ పైన చంద్రబాబు స్టేట్మెంట్ ఇస్తే తమకు క్లారిఫికేషన్కు మాత్రమే అవకాశమిస్తారని చెప్పారు. కాల్ మనీ పైన చర్చ జరగకుండా పది నిమిషాల్లో ముగించాలని చూస్తున్నారన్నారు.
చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాక చర్చ జరగడానికి ఏముందన్నారు. ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని రూల్స్.. స్టేట్ మెంట్ తర్వాత చర్చ అని ఏపీలో చెబుతున్నారని, ప్రకటన తర్వాత చర్చ ఏముంటుందన్నారు.
యనమల మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత.. వారు చెప్పిందే వినాలన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ సభా పద్ధతులు తెలుసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. బిఏసీ అజెండా ప్రకారమే సభ నడుస్తుందన్నారు. సభలో వైసిపి నేతలు అరుపులు, కేకలు వినిపించాయి.
దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ఈ రోజు శుక్రవారం అని, జగన్కు కోర్టుకు వెళ్లే సమయం అవుతుందని, అందుకే వారు రాద్దాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గొడవ జరిపి సభను వాయిదా పడేలా చేసి, తద్వారా బయటకు వెళ్లాలనే భావన వారిలో కనిపిస్తోందన్నారు. చర్చిస్తామని ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రతిపక్షానికి అవగాహన లేకపోవడం విడ్డూరమన్నారు. తొలుత క్వశ్చన్ అవర్ జరగనివ్వాలన్నారు.
స్పీకర్ కోడెల మాట్లాడుతూ... తొలుత సభ నడిచేందుకు ప్రతిపక్షం సహకరించాలని కోరారు. కాల్ మనీ పైన చర్చకు అనుమతిస్తామని చెప్పారు.
కాల్ మనీ పైన చంద్రబాబు ప్రకటన చేస్తారని, చర్చిద్దామని ప్రభుత్వం చెప్పగా.. ప్రకటన కంటే ముందే చర్చకు జగన్ పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సభాపతి కోడెల శివప్రసాద రావు సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.