దిశ బిల్లు -2019 కు అసెంబ్లీ ఆమోదం: మహిళల జోలికి వెళ్తే ఖబడ్దార్: 21 రోజుల్లోనే విచారణ..మరణ శిక్ష..!
Recommended Video
ఏపీ శాసనసభ చారిత్రాత్మక బిల్లు దిశ -2019 బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దిశ ఘటన తరువాత ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రత మీద తీసుకోవాల్సిన చర్యల పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా..ఇప్పుడున్న చట్టాలను మార్చి..కొత్త చట్టం తేవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగా..కేబినెట్ సమావేశంలో ఆమోదించిన దిశ బిల్లు ను సభలో ప్రవేశ పెట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి ఆలోచనలతో ఏకీభవించారు.
అదే సమయంలో కొన్ని సూచనలు చేసారు. బిల్లుకు మద్దతు ప్రకటించారు. ఎవరైనా మహిళల పైన అత్యాచారానిని పాల్పడితే వారికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా ఈ చట్టం రూపొందించారు. ఇందులో భాగంగా రెండు బిల్లులను ఆమోదించారు. అందులో ఒకటి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఈ బిల్లు దేశానికే మార్గదర్శకంగా ఉంటుందని సభలో బిల్లు గురించి వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేసారు.
మహిళల జోలికి వెళ్లే...21 రోజుల్లోనే మరణ శిక్ష
ఏపీ అసెంబ్లీ సంచలన దిశ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం ఎవరైనా మహిళల పైన అత్యాచారానికి..అఘాయిత్యాలకు పాల్పడితే వారికి 21 రోజుల్లోనే మరణ శిక్ష పడేలా బిల్లులో పేర్కొన్నారు. బాధితురాలి కి సత్వర న్యాయం జరిగేలా ఈ చట్టం తీసుకొస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
మహిళల జోలికి వెళ్లాలనుకొనే వారికి వెన్నులో వణుకు పుట్టేలా చట్టం ఉండాలని..అందుకే ఇటువంటి బిల్లును తీసుకొచ్చామని ప్రకటించారు. ఘటన జరిగిన తరువాత తొలి ఏడు రోజుల్లోనే కావాల్సిన ప్రాధమిక సమాచారం సేకరణ..ఆ తరువాత 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేసేలా బిల్లులో పొందుపరిచారు. ఇందు కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రత్యేకంగా పాస్ట్ ట్రాక్ కోర్టులు..డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక పోలీసుల టీంలు..అదే విధంగా ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
చిన్నారులై కన్నేసినా...సోషల్ మీడియాలో వేధించినా..
రెండు పార్టులుగా ఈ బిల్లును ప్రతిపాదించారు. అందులో చిన్నారుల పైన ఎవరైనా కన్నేస్తే.. వారి పైన కఠిన చర్యల దిశగా బిల్లులో ప్రతిపాదించారు. వారికి కఠిన శిక్షలు పడేలా సీపీసీలో మార్పులు తెస్తూ బిల్లును ప్రవేశ పెట్టగా..సభ ఆమోదించింది. ఇక, సోషల్ మీడియా ద్వారా అనేక మంది మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారని..వారికి రక్షణ కల్పించే చట్టాలు లేకుండా పోయాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసారు.
దీంతో..ఎవరూ మహిళలను సోషల్ మీడియా ద్వారా వేధింపులకు దిగకుండా అడ్డు వేసేందుకు చట్టంలో సవరణలు తీసుకొస్తూ బిల్లులో కొన్ని ప్రతిపాదనలు చేసారు. సోషల్ మీడియాలో ఎవరైనా మహిళలను వేధించినా..అసభ్యంగా పోస్ట్ లు పెట్టినా తొలి సారి రెండేళ్ల శిక్ష్..రెండో సారి చేస్తే వారికి నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడేలా బిల్లును ప్రతిపాదించారు. దీని కోసీం సీపీసీ 173, 309 లో సవరణలు తీసుకొస్తూ బిల్లులో చేసిన సవరణలకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణకు హాట్సాఫ్..దేశానికి మార్గదర్శకంగా
తెలంగాణలో దిశ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరోసారి ముఖ్యమంత్రి జగన్ హాట్సాఫ్ చెప్పారు. ఇక, మానవ హక్కుల సంఘాలు..న్యాయ పరమైన అడ్డంకులు ఏర్పడితే పోలీసులు ఏ రకంగా విధులు కొనసాగిస్తారని సీఎం ప్రశ్నించారు. పోలీసులకు ధైర్యం ఇవ్వటానికి..బాధితులకు సత్వర న్యాయం జరగటానికి ఈ బిల్లు తీసుకొచ్చినట్లు సీఎం జగన్ స్పష్టం చేసారు.
అదే సమయంలో..ఇది యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. నిర్భయ కేసులో నాలుగు నెలలకే న్యాయం జరగాలని ఉన్నా.. ఏడేళ్లు అవుతున్నా ఇంకా శిక్ష పడలేదని గుర్తు చేసారు. ఇప్పుడు ఈ బిల్లు రెండు రకాలుగా ఉంటుందని..ఒకటి రాష్ట్రపతి ఆమోదం అవసరం అవుతుందని సీఎం చెప్పుకొచ్చారు. కేంద్రం..రాష్ట్రం కలిసి ఇటువంటి చట్టాల్లో కలిసి పని చేయాల్సి ఉంటుందని..ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టం మొత్తం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని సీఎం జగన్ సభలో హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.