తొలి ప్రసంగంలోనే జగన్ టార్గెట్ ఫిక్స్: చంద్రబాబుకు సీఎం పంచ్లు: ప్రతిపక్ష నేత సైతం..!
ఏపీ శాసనసభలో జగన్ తొలి ప్రసంగంలోనే తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. స్పీకర్కు అభినందనల సందేశంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పంచ్లు వేసారు. నాడు సభలో ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వలేదని..ఫిరాయింపులను ప్రోత్సహించి మంత్రులను చేసారని గుర్తు చేసారు. టీడీపీ ఎమ్మెల్యేలను మనం లాగేసుకుందాం అంటూ కొందరు తన వద్ద ప్రతిపాదన చేసినా..తాను ససేమిరా అన్నానని స్పష్టం చేసారు. ఒక వేళ అలా జరిగితే వెంటనే అనర్హత వేటు వేయండంటూ కొత్త స్పీకర్కు సూచించారు. ఆ తరువాత ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడిన చంద్రబాబు ఎక్కడా సీఎం వ్యాఖ్యలకు సమాధానం మాత్రం చెప్పలేదు. కానీ, ప్రతిపక్ష నేతగా తన గురించి చెప్పుకున్నారు.
జగన్ తొలి ప్రసంగంలోనే..
ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఏపీ శాసనసభలో ప్రసంగించారు. స్పీకర్గా తమ్మినేని సీతారం ఎన్నిక తరువాత ఆయనకు జగన్ అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. స్పీకర్ పదవి సైతం బీసీలకే ఇవ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వంలో శాసనసభ నిర్వహించిన తీరు పైన జగన్ విమర్శలు చేసారు. ప్రతిపక్ష నేతగా మైకు కూడా ఇవ్వలేదని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులను ప్రోత్సహించారని గుర్తు చేసారు. ప్రతిపక్ష స్థానంలో ఉండాల్సిన సభ్యులను అనైతికంగా మంత్రులను చేసారని..తాము ఎంతగా వేడుకున్నా పట్టించుకోకపోవటంతో తాము తప్పని పరిస్థితుల్లో అసెంబ్లీ బహిష్కరించాల్సి వచ్చిందని వివరించారు. అదే విధంగా తాము వ్యవహరిస్తూ ఇక వారికి..తనకు తేడా ఉండదనే ఉద్దేశంతో తాము మంచి సాంప్రదాయం కోసం ప్రయత్నం చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.
Recommended Video
అలా చేస్తే..అనర్హత వేటు వేయండి..
ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగంలో ఫిరాయింపుల గురించి ప్రస్తావించారు. నాడు ఫిరాయింపులకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేసారు. తాను గెలిచిన తరువాత కొందరు తన వద్దకు వచ్చి టీడీపీ నుండి గెలిచిన వారిలో ఆరుగురిని మనం లాగేద్దామని..టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పారన్నారు. అయితే, తాను ఏ మాత్రం దానికి సుముఖంగా లేనని..తమ పార్టీలోకి ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా ఆ పార్టీకి రాజీనామా చేసి రావాల్సిందేనని స్పష్టం చేసారు. ఒక వేళ ఎవరినైనా తాము అలా కాకుండా ఫిరాయింపులకు పాల్పడితే వారి పైన ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని కోరారు. ఇక, దేవుడి స్క్రిప్టు అంటూ టీడీపీ తమ వైపు ఫిరాయింపు చేసుకున్న ఎమ్మెల్యే సంఖ్య 23 కాగా..వారు ఇప్పుడు గెలుచుకున్నది 23 మందిని మాత్రమేనని గుర్తు చేసారు. అదే విధంగా ఎంపీ ల విషయంలోనూ జరిగిందన్నారు. ఆ సమయంలో చంద్రబాబు ఇబ్బంది పడినట్లుగా స్పష్టంగా కనిపించింది.
చంద్రబాబు సైతం...
స్పీకర్ అభినందన సమయంలో ముఖ్యమంత్రి తరువాత ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు మాట్లాడారు. ఆ సమయంలో చంద్రబాబు వాయిస్ గట్టిగా వినిపించక పోవటంతో అధికార పక్ష సభ్యులు వ్యాఖ్యలు చేసారు. దీనికి స్పందనగా తన వాయిస్ బలంగానే ఉందని..మైకులే మీరు సరిగ్గా ఏర్పాటు చేయలేకపోయారంటూ సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షం తమకు కొత్త కాదని..గతంలో మూడు సార్లు ప్రతిపక్ష పార్టీగా టీడీపీ వ్యవహరించిందని గుర్తు చేసారు. తన వాయిస్..తమ పార్టీ వాయిస్ ఎక్కడా తగ్గదని వ్యాఖ్యానించారు. మీకే అధికారం కొత్త అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యల మీద మాత్రం స్పందించ లేదు. తాము శ్రీకాకుళం జిల్లాకే చెందిన ఎస్సీ వర్గం నుండి ప్రతిభా భారతికి స్పీకర్ పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూనే..క్లుప్తంగా కొత్త స్పీకర్ తమ్మినేని సీతారాంను అభినందిస్తూ మాట్లాడారు.