పుటేజ్ రగడ: 'టీడీపీ ఎమ్మెల్యేలు తిడుతుంటే మైక్ కట్ ఎందుకు కట్ చేయరు'
హైదరాబాద్: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పచ్చి బూతులు తిడుతూ నీచంగా మాట్లాడినా అతడిపై కనీస చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పుటేజీపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని చెవిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన వాస్తవ పుటేజిని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయమైన అసెంబ్లీలో వినడానికి వీల్లేని భాషలో మాపై తిట్ల పురాణం లంకించుకున్నారన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు మరింత దారుణమని మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు జుగుప్సాకరంగా మాట్లాడారని చెప్పిన ఆయన టీడీపీ ఎమ్మెల్యేల ఫుటేజ్ ను కూడా విడుదల చేస్తే ప్రజలు ఛీ కొడతారన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలంటే, ముందు చంద్రబాబుపైనే పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబు పోటీ పెట్టి మరీ వారి సభ్యుల చేత మమ్మల్ని తిట్టిస్తున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ్య సమాజం తలదించుకునేలా సభలో వ్యవహరిస్తున్నారు. మా అధ్యక్షుడిని మా ఎదుటే దారుణంగా తిడుతున్నారని దానికి ఎలాంటి చర్యలు స్పీకర్ తీసుకోకపోడవం దారుణమన్నారు.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చంపి పాతరేస్తా అన్నా అతడిపై కనీస చర్యలు తీసుకోలేదన్నారు. మేము మైక్ అడిగితే స్పీకర్ ఇవ్వరు, కానీ టీడీపీ ఎమ్మెల్యేలు తిడుతుంటే మైక్ కట్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న నమ్మకంతోనే ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. కానీ, స్పీకర్ అలా వ్యవహరించడం లేదు కాబట్టే ఆయనపై అవిశ్వాసం పెట్టామన్నారు. సభలో టీడీపీ సభ్యులు మాట్లాడిన ఫుటేజ్ను కూడా వెంటనే విడుదల చేయాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు.