ఏపీ సభాపర్వం .. కీలకబిల్లులపై నేడు చర్చ.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదని టీడీపీ సభ్యుల వాకౌట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు సమావేశాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అగ్రికల్చర్ కౌన్సిల్ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. హోంమంత్రి మేకతోటి సుచరిత దిశ బిల్లును ప్రవేశపెట్టారు. అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టాన్ని ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. ఏపీ వాల్యుయేటెడ్ ట్యాక్స్ థర్డ్ అసైన్మెంట్ బిల్లును డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రవేశపెట్టారు. ఇవాళ అసెంబ్లీలో 11 కీలక బిల్లులపై చర్చ జరగనున్నాయి. ఇదే సమయంలో పోలవరంపై కూడా స్వల్పకాలిక చర్చ జరగనుంది.
మూడో రోజు సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే సభ నుంచి వాకౌట్ చేసిన సభ్యులు
అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగుదేశం పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే విద్యుత్ సవరణ బిల్లు, అసైన్డ్ భూముల లీజు అంశాలపై చర్చ జరపాలని టిడిపి సభ్యులు పట్టుబట్టారు. ఈ అంశంపై చర్చించడానికి టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వాలని టిడిపి నేతలు కోరారు. అయితే స్పీకర్ చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వకపోవడంతో నిరసన తెలుపుతూ టిడిపి నేతలు సభ నుండి వాకౌట్ చేశారు.
అచ్చెన్నాయుడుని మాట్లాడకుండా అడ్డుకున్న వైసీపీ సభ్యులు
ఇక ఈ రోజు సభ ప్రారంభమైన తరువాత అసెంబ్లీ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోలార్ పవర్ పై మాట్లాడుతుంటే అధికార పార్టీ నేతలు మాట్లాడకుండా చేశారని టీడీపీ మండిపడుతుంది . అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న సందర్భంలోనే గందరగోళం సృష్టించారని పేర్కొంది . రాష్ట్రంలో సోలార్ పవర్ పేటెంట్ చంద్రబాబునాయుడు అని అచ్చెన్నాయుడు చెబుతున్న సమయంలో చంద్రబాబు 25 ఏళ్లు లీజ్ కి ఇచ్చి కొంతమంది వ్యక్తులకు ధారాదత్తం చేశారని, పీపీఏలన్నీ వన్ సైడ్ గా చేసుకున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే సభలో మేమెందుకు ... వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు
ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పేది వినకుండానే అధికారపక్ష నేతలు రాద్ధాంతం చేశారని, అచ్చెన్నాయుడిని మాట్లాడకుండా చేశారని టిడిపి నేతలు మండిపడుతున్నారు.
మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ టిడిపి ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు . అంతకు ముందు ప్రభుత్వం సంద మాఫియాని ప్రోత్సహిస్తుందని , దోపిడీకి పాల్పడుతుందని , రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకటం లేదని ఆరోపిస్తూ టీడీపీ అసెంబ్లీ దగ్గర ఆందోళన చేసింది. జగన్ భవన నిర్మాణ రంగ కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు టీడీపీ నేతలు .ఉచిత ఇసుక విధానం అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.