ఈసారి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ భేటీ-అజెండా ఇదే..! బీఏసీ కీలక నిర్ణయాలు..
ఏపీలో ఈసారి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. తొలుత మూడు రోజుల పాటే నిర్వహించాలని భావించినా కీలక మైన నిర్ణయాల కోసం అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాల అజెండాను ఖరారు చేసేందుకు ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది. అయితే ఈ భేటీకి విపక్ష వైసీపీ దూరంగా ఉండిపోయింది.
ఇవాళ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు , మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. వైసీపీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. అసెంబ్లీ నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై బీఏసీలో చర్చించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని జూలై 26 వరకూ నిర్వహించాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు.

ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ గవర్నర్ ప్రసంగం జరిగింది. ఈ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇందులో ప్రతీ పార్టీ నుంచి సభ్యులు ప్రసంగిస్తారు. వైసీపీ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని నిర్ణయించడంతో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే ఇందులో ప్రసంగించనునున్నారు. అనంతరం వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఉపసంహరిస్తూ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. అలాగే విజయవాడ వైఎస్సార్ హెల్త్ వర్శిటీ పేరు ఎన్టీఆర్ గా మారుస్తూ మరో బిల్లు తెస్తారు.
అలాగే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మిగిలిన శ్వేతపత్రాలను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వీటిలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్ విధానం, అప్పులు-ఆర్ధిక పరిస్ధితిపై మూడు శ్వేతపత్రాలు ఉంటాయి. వీటి విడుదల, అనంతరం చర్చలు ఉండే అవకాశముంది. చివరిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలిపే అవకాశముంది. మరోవైపు ఈసారి అసెంబ్లీలో నలుగురు ప్యానల్ స్పీకర్లను పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బీఏసీ భేటీ తర్వాత వెల్లడించారు.












Click it and Unblock the Notifications