AP Assembly : 27 వరకూ ఏపీ అసెంబ్లీ- రేపు స్కిల్ చర్చ- బీఏసీ నిర్ణయం-టీడీపీ బాయ్ కాట్...
ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ :ఏపీలో ఇవాళ సమావేశమైన అసెంబ్లీ (AP Assembly) బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సమావేశమైన అసెంబ్లీ బీఏసీ.. ఈ ఐదు రోజుల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల అజెండాను సైతం ఖరారు చేసింది. అయితే అప్పటికే అసెంబ్లీ నుంచి సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు బీఏసీ సమావేశాన్ని బహిష్కరించి తమ నిరసన తెలిపారు.
బీఏసీ భేటీ బహిష్కరించిన టీడీపీ : స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గన,చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరయ్యారు. టీడీపీ ప్రతినిధి లేకుండానే ఈ సమావేశం సాగిపోయింది. ఇందులో ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన ఈ నెల 27 వరకు శాసన సభ సమావేశాలు కొనసాగుతాయి. అలాగే
శని, ఆదివారం సభకు సెలవు ప్రకటించారు.

రేపు అసెంబ్లీలో స్కిల్ చర్చ : మరోవైపు ఐదు రోజుల పాటు సాగే సమావేశాల్లో ముందుగా రేపు ఏపీలో టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో చంద్రబాబు పాత్ర, ఆయన అరెస్టు, రిమాండ్ కు దారి తీసిన అంశాలపై సీఎం జగన్ స్వయంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించే అవకాశం ఉంది. ఇవాళ టీడీపీ సభ ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్టుపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీన్ని స్పీకర్ తిరస్కరించడంతో ఆందోళన చేపట్టింది.
టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ : అసెంబ్లీలో చంద్రబాబు అరెస్టుకు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. స్పీకర్ పోడియంకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ఇందులో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం కూడా తిప్పారు. దీంతో ఆ తర్వాత స్పీకర్ ఆయనకు సభ తరఫున హెచ్చరిక చేశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ తో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ సమావేశాలు ముగిసేవరకూ స్పీకర్ సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications