AP Assembly: చంద్రబాబు అరెస్టుపై చర్చకు టీడీపీ వాయిదా తీర్మానం-సర్కార్ సై అంటే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. దాదాపు వారం రోజుల పాటు సాగే అవకాశమున్న ఈ సమావేశాల్లో సహజంగానే విపక్ష నేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం కాకరేపబోతోంది. దీనికి టీడీపీతో పాటు అధికార వైసీపీ కూడా ప్రిపేర్ అయి వచ్చినట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే విపక్ష టీడీపీ చంద్రబాబు అరెస్టుపై చర్చ కోరుతూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చంద్రబాబు అరెస్టుపై చర్చ పెట్టేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ దీనిపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. దానికి స్పీకర్ వెంటనే అనుమతించకపోవడంతో నిరసనకు దిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్ వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. దీంతో సభా కార్యకలాపాలకు తొలిరోజే అంతరాయం కలుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు అరెస్టుపై చర్చకు నినాదాలు చేస్తున్నారు. దీంతో స్పీకర్ వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లో రెండు అంశాలపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టిసారించబోతోంది. ఇందులో చంద్రబాబు అరెస్టు కూడా ఉంది. అలాగే ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన విజయాలపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఏసీ భేటీ కీలకంగా మారింది. ఇవాళ అసెంబ్లీ విరామంలో బీఏసీ భేటీ జరగబోతోంది. ఇందులో ప్రభుత్వం చంద్రబాబు అరెస్టుపై చర్చకు అంగీకరిస్తే మొత్తం అసెంబ్లీ సమావేశాలపై ఒక్కసారిగా ఆసక్తి పెరగనుంది.

అయితే ప్రభుత్వం చంద్రబాబు అరెస్టును అసెంబ్లీ వేదికగా సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వడంతో స్పీకర్ వెంటనే ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. అయితే బీఏసీ భేటీలో ఇరుపక్షాలు అంగీకరిస్తే మాత్రం అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనిపై చర్చ చేపట్టనున్నారు. అప్పుడు ప్రభుత్వం స్కిల్ స్కాంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలు, ఏపీ ఫైబర్ నెట్ స్కాంపైనా చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో ఇవాళ చంద్రబాబు బెయిల్, కస్టడీ, రిమాండ్, క్వాష్ పిటిషన్లపై ఏ తీర్పు వచ్చినా అది కచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిబింబించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications