ఆనందయ్యపై ఏపీ సర్కార్ సీరియస్- అనుమతి లేని ఒమిక్రాన్ మందు పంపిణీపై నోటీసులు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య ఇస్తున్న కోవిడ్ మందు మరోసారి వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఆయన పంపిణీ చేస్తున్న మందుపై ఆంక్షలు విధిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆయన ఒమిక్రాన్ వైరస్ కు మందు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఇవాళ ఆయుష్ శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
గతంలో కరోనా మందు ఇచ్చిన ఆనందయ్య.. ఇప్పుడు ఒమిక్రాన్ మందు పంపిణీపై ఆయుష్ శాఖ నోటీసులిచ్చింది. తాను పంపిణీ చేస్తున్న కరోనా మందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులు ఆయన్ను ఆదేశించారు. ఆనందయ్య పంపిణీ చేస్తోన్న మందుకు అనుమతి లేదని రాష్ట్ర ఆయుష్ శాఖ కమిషనర్ రాములు తెలిపారు. అనుమతి లేకుండా పంపిణీ ఎలా చేస్తారంటూ నోటీసులు ఇచ్చామన్నారు. ఒమిక్రాన్ పేరుతో ఇస్తున్న మందులో ఏయే పదార్థాలు వాడుతున్నారో, చెప్పాలని ఆనందయ్యకు ఇచ్చిన నోటీసుల్లో అధికారులు కోరారు. ఈ నోటీసులకు ఆనందయ్య ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు.
కరోనా మందు తయారీ లైసెన్స్ కోసం ఆనందయ్య ఇప్పటికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకున్నారని, కానీ ఇప్పటి వరకు దరఖాస్తు పెట్టలేదని ఆయుష్ శాఖ కమిషనర్ తెలిపారు. ఆనందయ్య దరఖాస్తు చేసుకుంటేనే లైసెన్స్ ఇస్తామన్నారు. కరోనా, అలా కాకుండా ఒమిక్రాన్ పేరుతో అనుమతి లేని మందులను వాడొద్దని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఈ నోటీసుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆయన ఓమిక్రాన్ మందులు ఇస్తున్నారని తెలిసి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులతో నెల్లూరు జిల్లాలో స్ధానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ఇప్పటికే మందు పంపిణీ ఆపకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు.