Andhra Pradesh Bandh News: టీడీపీ ఏపీ బంద్ - నిరసనలకు వైసీపీ పిలుపు : కొనసాగుతున్న అరెస్ట్ లు..!!
ఏపీలో పొలిటికల్ టెన్షన్ కనిపిస్తోంది. టీడీపీ నేత పట్టాభి వైసీపీ ముఖ్య నేతల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు..ఆ తరువాత వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాల పైన దాడులతో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్రంలో గంజాయి..డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పట్టాభి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వారు అంటూ మొదలు పెట్టి.. అనుచిత వ్యాఖ్యలతో తీవ్రంగా స్పందించారు. వైసీపీ శ్రేణులు దీనికి నిరసనగా టీడీపీ కార్యాలయాల ముందు నిరసనలకు దిగారు.
బంద్ కోసం రోడ్లపైకి టీడీపీ నేతలు
మంగళగిరి సమీపంలోని పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి దిగారు. కార్లు.. ఫర్నీచర్ ధ్వసం చేసారు. విజయవాడలో పట్టాభి నివాసంలోనూ ధ్వసం జరిగింది. దీంతో..టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి..డీజీపీ పైన విరుచుకుపడ్డారు. పార్టీ కార్యాలయాల పైన దాడులకు నిరసన గా ఈ రోజున ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. అందరూ కలిసి రావాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ కార్యాలయాలపైన దాడులను ఖండించాయి. బంద్ కు మాత్రం మద్దతు ప్రకటించలేదు.
నిరసనలకు వైసీపీ పిలుపు
ఇదే సమయం లో వైసీపీ సైతం నిరసనలకు పిలుపునిచ్చింది. టీడీపీ నేతలు చేసిన బూతు వ్యాఖ్యల పైన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల డిమాండ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలకు సిద్దమయ్యారు. ఇక, ఈ తెల్లవారు జాము నుంచే టీడీపీ నేతలు బస్టాండ్ల వద్దకు వచ్చి బస్సులు బయటకు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. బస్సులను అడ్డుకుంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. విశాఖ నగరంతో పాటుగా ఒంగోలు..టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం బంద్ లో పాల్గొనే ప్రయత్నం చేయగా..పోలీసులు అడ్డుకున్నారు.
పెద్ద ఎత్తున పోలీసు బలగాల మొహరింపు
వైసీపీ కార్యాలయాల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ కార్యాలయాల పైన దాడుల విషయాన్ని కేంద్ర హోం మంత్రి... గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో..మాటలు మీరితే ఊరుకోమని హోం మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడే వారిని చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు మందలించలేదని చెప్పుకొచ్చారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సులను అడ్డుకొనేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
బంద్ చేస్తున్న టీడీపీ నేతలు పోలీసుల అదుపులో
బస్టాండ్ ల ముందు నిరసనలకు దిగుతున్నారు. సాలూరు జాతీయ రహదారి పైన టీడీపీ శ్రేణులు ఆందోళనకు ప్రయత్నించాయి. అయితే, కొంత మంది నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకు సిద్దం అవుతున్న నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, విజయవాడ..గుంటూరు నగరాల్లో అదనపు పోలీసు బలగాలను మొహరించారు.