మా మామ అని చెప్పట్లేదు: ఎన్టీఆర్పై బాబు, అదే జగన్ టార్గెట్
విజయవాడ: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా మామ అని చెప్పడం కాదు కానీ, ఆయన పట్టుదలకు మారు పేరు అని ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం అన్నారు. కృషి ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.
నేను కూడా అలాగే, పట్టిసీమ నీటిని గోదావరికి తేవాలని సంకల్పించానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేర పార్టీ అని, అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ పార్టీ లక్ష్యం అన్నారు. ఎన్టీఆర్ టిడిపి పెట్టిన సమయం బ్రహ్మాండమైన లగ్నం అన్నారు. అందుకే అన్ని విజయాలేనని అభిప్రాయపడ్డారు.
పట్టిసీమ పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని, అది పూర్తికాదని చాలా మంది అన్నారన్నారు. ప్రపంచంలో అసాధ్యమనేది లేదని, ఏదైనా సాధ్యమని తాను ఆనాడే చెప్పానన్నారు. దేశంలో రెండు నదులను కలిపిన ఏకైక రాష్ట్రం ఏపీయే అన్నారు.
Also Read: పార్టీ మారితే అవినీతిపరులా: జగన్-సాక్షికి వైసిపి ఎమ్మెల్యే సూటి ప్రశ్న

దేశంలో ఎంతోమంది నదుల అనుసంధానం గురించి చెప్పారని, కానీ కలపలేదన్నారు. మనం కలిపామన్నారు. రాష్ట్రంలోని మిగతా నదులను కూడా తాము అనుసంధానం చేస్తామని చెప్పారు. 2003లో భారీ తుఫాన్ వస్తే రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.
ఏపీ దేశానికి అన్నదాతగా మారడం వెనుక కాటన్ దొర కృషి కారణమన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రి వద్ద చంద్రబాబు పవిత్ర నదుల సంగమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని, ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం తర్వాతే ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా మారాయన్నారు. గతేడాది గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహించామన్నారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని కృష్ణా పుష్కరాలు విజయవంతం చేస్తామన్నారు.
గోదావరి జీవనాడి, కృష్ణమ్మ ప్రాణనాడి ఈ రెండు నదుల అనుసంధానంతో ఏపీకి ఇక తిరుగు లేదన్నారు. నదుల అనుసంధానం చేయడం దేవుడు తనకిచ్చిన వరంగా భావిస్తున్నట్లు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేయడం అసాధ్యమని ప్రతిపక్ష నేతలు చేసిన సవాళ్లను స్వీకరించి సంవత్సరం వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు.
ప్రతిపక్షంగా ఉన్న వైసిపి నేర చరిత్ర కలిగిన పార్టీ అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ పార్టీ నేతల లక్ష్యమన్నారు. తనను అడ్డుకోవాలని చూస్తే బుల్లెట్లా దూసుకెళ్తానన్నారు. వైసిపి ఓ పనికి మాలిన పార్టీ అన్నారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని త్వరంలో పెన్నా నదికి గోదావరి జలాలు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications