డబ్బులు కేంద్రానివి-గొప్పలు జగన్వి- అచ్చం చంద్రబాబులా- ఆధారాలివే అంటున్న బీజేపీ...
గతంలో టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్లించి వాడుకునేది. దీనిపై కేంద్రం నుంచి టీడీపీ తప్పుకున్నాక విమర్శలు మొదలుపెట్టిన బీజేపీ నేతలు.. ఎన్నికల నాటికి వాటి తీవ్రత పెంచారు. ఇలా వాడుకోవడం మొదటిసారి కాకపోయినా తామిచ్చిన డబ్బులతో సొంత పథకాలుగా ప్రచారం చేసుకుని రాజకీయ ప్రయోజనం పొందడం ఏంటనేది బీజేపీ ప్రశ్న. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అదే బాటలో సాగుతోందని బీజేపీ బయటపెట్టింది. తాజాగా వైసీపీ సర్కారు ప్రారంభించిన మూడు పథకాలకు ఖర్చుచేస్తున్న 60 శాతం నిధులు కేంద్రానివే అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు.

సొమ్మొకరిది.. సోకొకరిది...
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తాము అమలు చేసే పథకాలతో పాటు రాష్ట్రాలతో కలిసి ఉమ్మడిగా కొన్ని పథకాలు నిర్వహిస్తుంటుంది. అంటే సదరు పథకానికి అయ్యే ఖర్చులో కొంత భాగం కేంద్రం ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా పథకాలు రాష్టాల్లో అమలవుతాయి. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంగీకరించి నిధులు కేటాయించి అమలు చేస్తాయి. మరికొన్ని సందర్భాల్లో వాటి అమలు వల్ల రాష్ట్రంలో అంతగా ప్రయోజనం లేదనుకుంటే వదిలేస్తాయి. ఆ నిధులను ఇతర పథకాలకు సైతం మళ్లిస్తాయి. మరికొన్నిసార్లు మాత్రం కేంద్రం ఇచ్చిన డబ్బులతో రాష్ట్రంలో పథకాలు ప్రారంభించి వాటికి తమ పేరు పెట్టుకుని అమలు చేస్తుంటాయి. ఏపీలో గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల తీరు ఈ చివరి మోడల్ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.

మా పథకాలతో మీ గొప్పలా ?
తాజాగా కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం కింద పాఠశాలల్లో వసతుల మెరుగు కోసం ఇచ్చిన నిధులతో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యాకానుక పథకాలు అమలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. జగనన్న విద్యాదీవెనలో 60 శాతం నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి వైసీపీ సర్కారును ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన సమగ్రశిక్ష అభియాన్ 2020-21 కింద రూ.655.60 కోట్లలో కేంద్రం 60% వాటా ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం 40% వాటా కలిపి రాష్ట్రంలోని 30 లక్షల 70 వేల 901 విద్యార్థులకు 3 జతల యూనిఫాం, పుస్తకాలు, షూస్-సాక్సులు, బెల్ట్, బ్యాగ్ లు ఇచ్చిందని విష్ణు ఆరోపించారు.

మారాలి జగన్.. మార్పు రావాలి జగన్..
ప్రభుత్వ నిధులతో సొంత పేపర్లను నిషేధించాలంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి తాజా ట్వీట్లో డిమాండ్ చేశారు. కేంద్రం నిధులతో జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద అనడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నిచారు. ఇది వాస్తవం అన్నారు. అందుకే మారాలి జగన్.. మార్పు రావాలి జగన్ అంటూ విష్ణు ట్వీట్లో పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి సురేష్ గారూ.. ప్రభుత్వ పథకాలకు జగన్ గారి పేరు వారి కుటుంబ ట్రస్ట్ నిధులు ఖర్చుపెట్టి సేవ చేస్తే అభ్యంతరం ఉండదన్నారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులిచ్చే పథకానికి సొంత పేరు ఎలా పెట్టుకుంటారని విష్ణు ప్రశ్నించారు. ఉమ్మడి పథకాలకు సొంత డబ్బా కొట్టుకునే ఆలోచనలు విద్యాప్రమాణాలపై పెడితే ప్రజలు హర్షిస్తారని విష్ణు సూచించారు. జగనన్న విద్యాకానుక అనే స్టిక్కర్ విద్యార్ధుల స్కూల్ బ్యాగులపై, బెల్టులపై అంటించి మరోసారి స్టిక్కర్ సీఎం పేరు సార్ధకం చేసుకున్నారని విష్ణు ఆక్షేపించారు.
Recommended Video

చంద్రబాబును తిట్టిన గురివింద జగన్..
గతంలో ఎన్డీయే ప్రభుత్వ నిధులను వాడుకుంటూ సొంత పేరుతో పథకాలు అమలు చేసుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించిన మీరు ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకూ కరెక్టని విష్ణు ప్రశ్నించారు. గత చంద్రబాబు ప్రభుత్వంపై మీరు చేసిన విమర్శలు గురువింద సామెతను గుర్తుకొస్తుందా సీఎం గారూ అంటూ విష్ణు తన ట్వీట్లో సూటిగా ప్రశ్నించారు. గతంలో వైసీపీ విపక్షంలో ఉండగా.. ఏయే అంశాలను చంద్రబాబును ప్రశ్నించిందో ఇప్పుడు వాటినే అమలు చేస్తున్నాయని బీజేపీ జగన్కు గుర్తుచేసింది. తద్వారా మీరిద్దరూ ఒకటే అనే విషయాన్ని బీజేపీ నేతలు వైసీపీ, టీడీపీకి గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications