బీజేపీ - టీడీపీ పొత్తు ఖాయమా : తేల్చి చెప్పిన కమలం జాతీయ నేత..!!
ఏపీలో ఎన్నికల పొత్తుల పై కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్డీఏలోకి టీడీపీ చేరనుందని..ఇందుకు ముహూర్తం ఖరారైందంటూ ప్రచారం సాగుతోంది. దీని పైన టీడీపీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన లేదు, వైసీపీ నేతలు ఈ పొత్తు వార్తల పైన స్పందిచలేదు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ - టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య జరిగిన పలకరింపులతో ఈ చర్చ మొదలైంది. ఇక, తాజాగా ఒక జాతీయ పత్రికలో వచ్చిన ఎడిటోరియల్ లో వ్యక్తి చేసిన అభిప్రాయంతో ఈ ప్రచారం మరింత పీక్ కు చేరింది.

పొత్తు ప్రచారం..రంగంలోకి థియోధర్
దీంతో..పాత మిత్రులు బీజేపీ - టీడీపీ మరోసారి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు దీని పైన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్.. పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ థిమోధర్ స్పష్టత ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ విధి విధానాలను బిజెపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది కాని వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్న రచయితలు కాదంటూ సునీల్ థియోధర్ వ్యాఖ్యానించారు. ఎర్రకోట పై నుండి ఆగష్టు 15న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన విధంగా దేశానికి నష్టం కలిగిస్తున్న అవినీతి కుటుంబ పార్టీలకు ప్రతి రూపమైన టీడీపీ ,వైసీపీ పార్టీలతో బిజెపి పార్టీకి రాష్ట్రంలో ఎటువంటి పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. టీడీపీ-వైసీపీతో పోరాడి 2024లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశ , మార్గం పైన తమ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని చెప్పుకొచ్చారు.

టీడీపీ - బీజేపి పొత్తుపై క్లారిటీ
ముఖ్యమంత్రి జగన్.. ప్రధానితో పలుమార్లు కలవటం ద్వారా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాల పైనా ఆయన స్పందించారు. దేశ ప్రధానిగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమావేశాలు ఉంటాయని చెబుతూనే మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. దుర్యోధనుడు కలిసేందుకు శ్రీ కృష్ణుడి చాలా సార్లు సమయం ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసారు. వచ్చే ఎన్నికల్లో తరహాలోనే టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయటం ద్వారా వైసీపీని ఓడించాలనేది అటు టీడీపీ - ఇటు జనసేన నేతలు కోరుకుంటున్నారు. జనసేనాని సైతం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనవ్వనని చెబుతూ.. పొత్తుల పైన మరింత ఆసక్తి పెంచుతున్నారు. పొత్తు ఉంటుందని..ఉండదనే విషయం తాను ఇప్పుడే బహిర్గతం చేయలేనన్నారు. ప్రధాని మోదీ - చంద్రబాబు కలవరన్నారని, ఇప్పుడు ఇద్దరూ కలిసారంటూ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలతో జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లనుందంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.

ఆ రెండు పార్టీల మధ్య ఖాయమేనంటూ
ఆ దిశగా అటు జనసేనాని ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, బీజేపీ ముఖ్య నేతలు మాత్రం టీడీపీతో కలిసే అంశం పైన ఆసక్తి చూపటం లేదనేది మరో వాదన. తాజాగా, అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో.. సునీల్ థియోధర్ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ గా చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత పొత్తుల పై ప్రచారం జరగుతున్న వేళ కీలకంగా మారింది. అటు వైసీపీ మాత్రం.. కేంద్రంలోని బీజేపీ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే..బీజేపీ ఏపీలో పొత్తుల పైన ఎటువంటి అడుగులు వేస్తుందనే అంశం పైన నిశితంగా గమనిస్తోంది. బీజేపీ ముందుకు రాకపోతే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఉంటుందని.. జనసేన మరింత కాలం బీజేపీతో కలిసి ముందుకు సాగే పరిస్థితులు లేవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు ఏపీలో పొత్తు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications