ఎపి బీజేపీ నేతలు తక్షణమే రాజీనామా చేయాలి:మంత్రి కొల్లు;ఐటి దాడులు ఎదుర్కొనేందుకు సిద్దం:కేశినేని
విజయవాడ:ఎపిలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఎగ్గొట్టినందుకు నైతిక బాధ్యతగా రాష్ట్ర బీజేపీ నాయకులు తక్షణం రాజీనామా చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
రాష్ట్ర బిజెపి నేతలు ఇలా చేసి తమ అధిష్టానానికి బుద్ధి వచ్చేలా చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. తెలంగాణలో వెనుకడిన జిల్లాలకు రూ.450 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం...ఏపీని చిన్నచూపు చూసిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. దీనిపై జగన్, పవన్ కళ్యాణ్ స్పందించాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.450 కోట్లు ఎగ్గొట్టినందుకు గాను ఎపి బిజెపి నేతలు తమ తప్పు సరిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లు సాధించాలని, ఆ దిశలో కృషి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సలహా ఇచ్చారు.
తెలంగాణలోని 9, ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలకు వెనుకబడిన జిల్లాల కింద నిధులు రావాలి. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రావాల్సి ఉంది. ఆరు నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలకు నిధులు రావాల్సి ఉంది...కానీ రాలేదు...అయితే ఈ క్రమంలో తెలంగాణకు తాజాగా రూ.450 కోట్ల నిధులు విడుదల కాగా ఏపీకి మాత్రం కేంద్రం మళ్లీ మొండి చేయి చూపింది.
మరోవైపు ఐటీ దాడులపై బిజెపి నేతల విమర్శలపై విజయవాడ ఎంపి కేశినేని మాట్లాడుతూ తాము ఐటి దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అసలు తమ వద్ద ఎలాంటి నల్లధనం లేదన్నారు. తమపై ఐటీ దాడులు చేసే ఆయా అధికారులు చేతులు ముడుచుకొని ఒట్టి చేతులతో వెనుతిరగడమే తప్ప...వారు సాధించేది...చేయగలిగేదేమీ ఉండదని ఎంపి కేశినేని నాని తేల్చేశారు.