ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వీర్రాజు, వైసీపీలోకి కన్నా, కారణాలివే.. టచ్లో కీలక నేతలు?
అమరావతి: భారతీయ జనతా పార్టీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయనను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టిందని, దీంతో ఆయన ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు.
విశాఖ ఎంపీ హరిబాబు ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పలువురి పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించింది. అందులో కన్నా లక్ష్మీనారాయణతో పాటు పురంధేశ్వరి, సోము వీర్రాజు, మాణిక్యాల రావు తదితరులను పరిశీలించింది. చివరకు సోము వీర్రాజు వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడి విషయంలో క్లారిటీ
ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి విషయంలో ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బీజేపీ నేతలకుఈ విషయాన్ని వెల్లడించారని సమాచారం. కొత్త బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజును ఎంచుకున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నేతలకు చెప్పారని తెలుస్తోంది.
కన్నా పేరు చివరి నిమిషం దాకా
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి సోము వీర్రాజును వరించిందని తెలియడంతో అప్పటి దాకా రేసులో ఉన్న కన్నా ఆవేదనకు లోనయ్యారని తెలుస్తోంది. ఆయన పేరును చివరి నిమిషం వరకు పరిశీలించారని తెలుస్తోంది. చివరకు అన్ని అంశాలతో సోము వీర్రాజును ఫైనలైజ్ చేశారని సమాచారం.
కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అసహనం
బీజేపీ అధిష్టానం పట్ల కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అసనహం, ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఆయన మరో పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆయన చూపులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని అంటున్నారు.
వైసీపీ ముఖ్య నేతలతో టచ్లో కన్నా
కన్నా లక్ష్మీనారాయణతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొందరు టచ్లో ఉన్నారని తెలుస్తోంది. ఆయనను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. మరోవైపు, కన్నా తన అనుచరులు, అభిమానులతో భేటీ అవుతున్నారు. వైసీపీలోకి వెళ్లాలనుకోవడం వెనుక రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఒకటి సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి కట్టబెట్టడం, రెండోది హోదా నేపథ్యంలో ఏపీలో బీజేపీకి పరిస్థితులు బాగా లేవని.