ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి: రేసులో సీమ వాసి, ఎవరీ చల్లపల్లి నరసింహ రెడ్డి?
అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు పదవీ కాలం ముగిసి రెండు నెలలకుపైగా అయింది. అయితే ఆయన స్థానంలో ఎవరిని నియమించాలో తెలియక బీజేపీ అధిష్టానం తికమకపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం ముగినప్పిటకీ ఆయనే బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఈ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రోజుకొకరి పేరు తెరమీదకు వస్తోంది. గతంలో సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమిస్తారనే వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆయనకు మద్దతు తెలుపుతూ ఒకవర్గం గట్టిగా పట్టుబడుతోంది. అయితే సోము వీర్రాజుని టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనకు బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తే సంబంధాలు దెబ్బతినడమే కాకుండా రాష్ట్రంలో బీజేపీ చీలిపోయే ప్రమాదం ఉందని బీజేపీ అధిష్టానం వెనుకంజ వేసినట్టుగా సమాచారం. ఆ తర్వాత బీజేపీ అధ్యక్ష రేసులో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరుల పేర్లు వినిపించాయి.
ఇప్పుడు తాజాగా రాయలసీమకి చెందిన చల్లపల్లి నరసింహ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బీజేపీలో సీనియర్ నేత కావడంతో పాటు వివాదాలకి దూరంగా ఉంటారనే మంచిపేరుంది. ప్రస్తుతం భాజపా జాతీయ కిసాన్ మోర్చాకి జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
రాయలసీమలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయనని రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించినట్లయితే, ఆ ప్రాంతంలో ఆ వర్గం ప్రజలని, నేతలని బీజేపీ వైపు ఆకర్షించవచ్చని, టీడీపీకి కూడా ఆయన ఆమోదయోగ్యుడని రాయలసీమకు చెందిన నేతలతో పాటు ఆయన మద్దతుదారులు సూచిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోవడంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన చాలా మంది నేతలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. అలాంటి రెడ్డి సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు ఆకర్షించడానికి చల్లపల్లి నరసింహ రెడ్డిని అధ్యక్షుడుగా నియమిస్తే బాగుంటుందని వాదిస్తున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందో లేదో చెప్పడం కష్టం కాబట్టి టీడీపీని రాష్ట్రంలో ఎదుర్కోనగల సత్తా ఉన్న నేత సోము వీర్రాజునే అధ్యక్షుడుగా నియమించడమే పార్టీకి మేలు చేస్తుందని మరో వర్గం వాదిస్తోంది. దీంతో వీరిద్దరిలో ఎవరినో ఒకరిని త్వరలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.