ఏపీ ప్రజలకు నరేంద్ర మోడీ ఈ మాట చెప్పమన్నారు: కన్నా, ఏపీపై బీజేపీ త్రిముఖ వ్యూహం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం, బీజేపీపై సీఎం చంద్రబాబు ఎదురుదాడి, ఇతర పార్టీల కార్యాచణ తదితర అంశాలపై వీరు చర్చించారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మోడీని కన్నా కలవడం ఇదే మొదటిసారి.
మోడీతో భేటీ అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చాలన్నదే ప్రధాని మోడీ అభిమతమని చెప్పారు. కేంద్రం పథకాలను తమ ఫోటోలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి అవినీతి, అసమర్థతతోనే విభజన హామీలు సాకారం కాలేదన్నారు. ఎస్పీవీలతో ముందుకొస్తే కేంద్రం ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.
చంద్రబాబు తమను మోసం చేసి వెనుదిరిగినా ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనే మాటను మోడీ రాష్ట్ర ప్రజలకు చెప్పమన్నారని తెలిపారు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఏపీ ప్రజలు మన వెంటే ఉంటారని మోడీ చెప్పారన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను నెరవేరుస్తామని చెప్పారన్నారు.
12 అంశాలపై ప్రధాని మోడీకి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ తదితరాలు ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందన్నారు. చంద్రబాబు ఏపీకి చేస్తున్న మోసాన్ని మోడీకి వివరించానని చెప్పారు. జూన్ 30వ తేదీ నుంచి ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
కాగా, ఏపీలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ త్రిముఖ వ్యూహన్ని రచిస్తోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడి తీవ్రతరం చేయటం, మరోవైపు కేంద్రం పథకాలను ప్రజల్లోనికి తీసుకెళ్లడం, ఇంకోవైపు ఇతర పార్టీ నాయకులను బీజేపీ వైపు తిప్పుకోవడం లక్ష్యంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది.