టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ ? చిరంజీవితో చర్చలు !
గతంలో లోక్ సభ అభ్యర్ధిగా మూడు పార్టీల నుంచి పార్టీ చేసి ఓటమి పాలై ఆ తర్వాత కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు ఏపీలో అధ్యక్షుడిగా మారిన తోట చంద్రశేఖర్ ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైపోతున్నారు. ఏపీలో ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ-జనసేన కూటమి మధ్యే ప్రధాన పోరు ఉండొచ్చని అంచనా వేసుకుంటున్న ఆయన.. ఈ మేరకు తిరిగి తన సొంత పార్టీ జనసేనకి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ తాజాగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జనసేన పార్టీలో గతంలో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. ఆ తర్వాత బీఆర్ఎస్ కు వెళ్లడంతో తిరిగి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గట్టి అభ్యర్ధుల కోసం ఎదురుచూస్తున్న జనసేన పార్టీలో చేరడం ద్వారా ఎమ్మెల్యే సీటులో తన అదృష్టం పరీక్షించుకునేందుకు తోట ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే జనసేన నేతలతో టచ్ లో ఉన్న తోట చంద్రశేఖర్ త్వరలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న పవన్ కళ్యాణ్ సమక్షంలో తోట చంద్రశేఖర్ జనసేనలో చేరే అవకాశాలున్నాయి. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా గుంటూరు పశ్చిమ సీటును జనసేనకు కేటాయించేందుకు ఇప్పటికే టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ వైసీపీలోకి ఫిరాయించారు. అయితే ఆయనకు ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. మద్దారి గిరి స్ధానంలో మంత్రి విడదల రజనీకి ఛాన్స్ ఇస్తోంది.
తోట చంద్రశేఖర్ ఈసారి టీడీపీ-జనసేన అభ్యర్ధిగా గుంటూరు పశ్చిమ సీటులో బరిలోకి దిగితే మంత్రి విడదల రజనీతో పోటీ పడాల్సి ఉంటుంది. అయితే గుంటూరు పశ్చిమ సీటు పరిధిలో ఉన్న కాపు, కమ్మ ఓట్లు పూర్తిస్ధాయిలో పడితే తన గెలుపు సులువవుతుందని తోట చంద్రశేఖర్ లెక్కలు వేసుకుంటున్నారు. వైఎస్ జగన్ మాత్రం బీసీ, మహిళా అభ్యర్ధి అయిన విడదల రజనీని బరిలోకి దించడం ద్వారా బీసీ, మహిళలు, ఎస్సీ, మైనార్టీల ఓట్లను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications