చెవిరెడ్డికి మూడో పదవి: కట్టబెడుతూ సీఎం జగన్ నిర్ణయం: ఎందుకింత ప్రాధాన్యత...!
చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మరో పదవి దక్కింది. ముఖ్యమంత్రి జగన్ తొలి నుండి తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న చెవిరెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజా ఎన్నికల్లో చెవిరెడ్డి చంద్రగిరి నుండి వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ప్రభుత్వ విప్గా నియమిస్తూ ముఖ్యమంత్రి గతంలోనే నిర్ణయం తీసుకున్నా రు. అదే సమయంలో తన ప్రభుత్వంలో తొలి నామినేటెడ్ పదవి సైతం చెవిరెడ్డికే కట్టబెట్టారు. తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ) ఛైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అదే పదవితో చట్ట సవరణ చేసి మరీ చెవిరెడ్డికి మరో పదవి అప్పగించటానికి రంగం సిద్దమైంది.
చెవిరెడ్డికి మూడో పదవి..ముఖ్యమంత్రి నిర్ణయం..
వైసీపీ ఎమ్మెల్యే హార్డ్ కోర్ జగన్ విధేయుడు అయిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి మూడో పదవి దక్కనుంది. చెవిరెడ్డి ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. తుడా ఛైర్మన్గా చెవిరెడ్డికే సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. ఇక, ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో తుడా ఛైర్మన్ను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ చేసిన చట్ట సవరణ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసిన నిర్ణయాన్ని తిరిగి అమలు చేసే విధంగా జగన్ ప్రభుత్వం సవరణ చేసింది. ఈ నిర్ణయం తో చెవిరెడ్డి తుడా ఛైర్మన్ హోదాలో టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషి యో సభ్యుడి హోదాలో కొనసాగనున్నారు. టీటీడీ బోర్డు ఛైర్మన్గా సుబ్బారెడ్డిని నియమించిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు పరోక్షంగా చెవిరెడ్డి భాస్కర రెడ్డిని టీటీడీ తొలి సభ్యుడిగా నియమించినట్లుగా స్పష్టం అవుతోంది.

చెవిరెడ్డికి ఎందుకింత ప్రాధాన్యత..
వైయస్సార్ కుటుంబానికి చెవిరెడ్డి తొలి నుండి విధేయుడిగానే ఉంటున్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన తుడా ఛైర్మన్గా 2007-2010 వరకు పని చేసారు. ఆయనకు ముందు భూమన కరుణాకర రెడ్డి ఛైర్మన్గా వ్యవహరించారు. భూమన కరుణాకర రెడ్డి దాదాపుగా చెవిరెడ్డికి రాజకీయ గురుగా చెబుతారు. కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్గా పని చేసిన సమయంలో చెవిరెడ్డి ఆయన అనుచరుడిగా తిరుపతిలో కీలకంగా మారారు. ఇక, వైయస్ మరణం తరువాత జగన్కు దగ్గరయ్యారు. 2014,2019 ఎన్నికల్లో చంద్రబాబు స్వగ్రామం ఉన్న సొంత నియోజకవర్గం చంద్రగిరి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, చిత్తూరు జిల్లా నుండి ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి..మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఏపీఐఐసీ ఛైర్మన్గా రోజా..తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి ఉన్నారు. ఇప్పుడు కేబినెట్ తాజా నిర్ణయంతో చెవిరెడ్డి భాస్కర రెడ్డికి మరో పదవి దక్కటం లాంఛనమే.












Click it and Unblock the Notifications