బంగారం జోలికి వస్తే అంతే: ఆ భేటీలో చంద్రబాబు లేవనెత్తాలని సూచన
బంగారం పైన కేంద్రం విధించిన పరిమితుల పైన గురువారం ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది.
అమరావతి: బంగారం పైన కేంద్రం విధించిన పరిమితుల పైన గురువారం ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారిలో వ్యతిరేకత వస్తోందని, కేంద్రం బంగారం జోలికి వస్తే మాత్రం మరింత ప్రతికూలత వస్తుందని మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో దీని పైన చర్చించాల్సిన అవసరముందని వారు అన్నారని తెలుస్తోంది. కేంద్ర కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని చంద్రబాబు లేవనెత్తాలని మంత్రులు సూచించారని తెలుస్తోంది. కేంద్రం బంగారం జోలికి రాకుండా చూడాలని చెప్పారని సమాచారం. కాగా, బంగారం జోలికి రావొద్దని బోండా ఉమ బీజేపీని హెచ్చరించిన విషయం తెలిసిందే.

మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో నవంబర్ నెలలో రాష్ట్రానికి రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు చెప్పారు. ఈ నెలలో రూ.1500 కోట్ల నష్టం రావొచ్చునని చెప్పారు. కాగా, బంగారం పన్ను పైన కేంద్రం ఈ రోజు వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
కేబినెట్ నిర్ణయాలు
- రూ.4వేల కోట్ల వ్యయంతో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, స్టార్ హోటల్ నిర్మాణం
- చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్ ఫ్యాక్టరీకి 200 ఎకరాల కేటాయింపు
- అమరావతిలో బీఆర్ శెట్టి గ్రూప్కు 100 ఎకరాల కేటాయింపు
- పోలీస్ సబ్ డివిజన్ భవనానికి 1.5 ఎకరాల కేటాయింపు
- అర్హులైన పేదలకు 3.5 లక్షల పెన్షన్లు మంజూరు
- రాజధాని భవనాల ప్రభుత్వ డిజైన్ల పైన రెండు రోజుల్లో బిడ్ల పరిశీలన
- అగ్రిగోల్డ్ ఆస్తులపై చర్చ












Click it and Unblock the Notifications