ఏపీ కేబినెట్ విస్తరణలో ఎంపీలు : అమరావతికి పిలుపు : కొత్త మంత్రుల కూర్పులో నయా ఈక్వేషన్స్..!!
ఏపీ కేబినెట్ విస్తరణ ఇప్పుడు అధికార పార్టీలో ఉత్కంఠక కారణమవుతోంది. కేబినెట్ ప్రక్షాళన ఖాయమనేది స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా సీఎం జగన్ బంధువు.. సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనతో సీఎం కేబినెట్ లో వంద శాతం మార్పులు ఉంటాయని చెప్పారంటూ వెల్లడించటంతో మరింత హీట్ పెరిగింది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న వారిని మొత్తాన్ని తప్పించి కొత్త వారికి అందునా సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కేబినెట్ కూర్పులో జగన్ కొత్త సమీకరణాలు
తొలుత 90 శాతం వరకు మంత్రులను తప్పించాలని భావించినా..కొందరిని తప్పించి..మరి కొందరని కొనసాగిస్తే కొత్త సమస్యలు వస్తాయనే అంచానకు వచ్చారు. దీంతో..విధాన పరమైన నిర్ణయంగా అందరినీ తప్పించి..కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో ప్రభుత్వ-పార్టీ పరంగా బలమైన వాయిస్ వినిపించే నేతలు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పుడు జగన్ ఎంపిక చేసుకొనే కేబినెట్ పూర్తిగా 2024-ఎన్నికల కేబినెట్ కావటంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
ఎన్నికల టీం కావటంతో ప్రాధాన్యత
సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ..అదే సమయంలోనూ పార్టీలో ఇబ్బందులకు కారణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు సైతం భర్తీ కావటంతో..ఇక సీనియర్లు అందరూ కేబినెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. దీంతో...సాధారణగా ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు చాలా మంది ఈ సారి జగన్ కేబినెట్ లో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో..సీఎం జగన్ తాజాగా పార్టీలోని ప్రస్తుత మంత్రులు..ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీతో పాటుగా ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎంపీలతో కీలక మంతనాలు
ఇందు కోసం పార్టీకి చెందిన లోక్ సభ ..రాజ్యసభ సభ్యుల తో చర్చించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 29వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పార్టీ ఎంపీలతో సీఎం చర్చించనున్నారు. మూడు ప్రాంతాలకు చెందిన ఎంపీలకు మూడు రోజుల్లో చర్చలు చేపట్టనున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా వారి పార్లమెంటరీ పరిధిలో పార్టీ పరిస్థితులు..సీనియార్టీ..విధేయ..వచ్చే ఎన్నికల్లో ప్రభావం వంటి అంశాల పైన వారితో చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటికే సేకరించిన సర్వే నివేదిక ల ఆధారంగా ఎవరికి కేబినెట్ లో అవకాశం ఇవ్వాలనే అంశం పైన సీఎం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
కేంద్రం తోనూ ఇక సీరియస్ గానే..
దీంతో పాటుగా ఎంపీల అభిప్రాయాలను తెలుసుకొని ..మంత్రులుగా ఎవరు ఎంపిక అయినా కలిసి పని చేసుకోవాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో కొందరు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు దక్కుతాయనే అంచనాలు వారిలో కనిపిస్తున్నాయి. తన పాలనలో సెకండాఫ్ ప్రారంభం అవుతున్న పరిస్థితుల్లో పాలనా -రాజకీయంగా కొత్త మార్పులతో ముందుకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందస్తు ప్రిపరేషన్
దీంతో...ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది సీఎం అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రయెజనాల విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే అంశాల పైన సీఎం ఎంపీలకు మార్గ దర్శకం చేయనున్నారు. ఇప్పటి వరకు సహనంతో ఉన్నా..కేంద్రం ఉదాసీనంగా ఉండటం పైన వైసీపీ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. దీంతో..ఇటు ఏపీలో ఎన్నికలకు ముందు నుంచే సిద్దం అవుతూనే.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ప్రయోజనాల విషయంలో తమను ప్రశ్నించే అవకాశం లేకుండా వ్యవహరించాలనేది జగన్ భావనగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఏపీలో కేబినెట్ విస్తరణ... కేంద్రంతో రానున్న రోజుల్లో సంబంధాలు..బద్వేలు ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయంగా పరిస్థితులు రసవత్తరంగా మారనున్నాయి.