ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు- మరిన్ని హామీల అమలు- త్వరలో కొత్త పథకాల ప్రారంభం...

ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నవరత్నాల పెండింగ్‌ పథకాలతో పాటు ఇప్పటికే తీసుకున్న పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో అమల్లోకి వస్తున్న కొత్త పారిశ్రామిక విధానానికి సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పథకాలను త్వరలో ప్రారంభించేందుకు వీలుగా కేబినెట్‌ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో నేటి కేబినెట్‌ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు హాజరు కాలేదు.

 ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ ఇవాళ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైనది, నవరత్నాల హామీల్లో ఒకటైన వైఎస్సార్‌ ఆసరా పథకం. 2019 ఏప్రిల్‌ 11 నాటికి ఏపీలో బ్యాంకులకు డ్వాక్రా మహిళలు బకాయిపడిన రుణాలను ప్రభుత్వం నాలుగేళ్లలో తీర్చేందుకు ఉద్దేశించిన పథకం ఇది. దీనిలో భాగంగా ఈ ఏడాది నుంచి ఈ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వం డ్వాక్రా రుణాల చెల్లింపు కోసం రూ. 6792 కోట్లు విడుదల చేయబోతోంది. దీంతో 90 లక్షల మంది డ్వాక్రా మహిళల కష్టాలు తీరనున్నాయి.

అలాగే మరో పథకం జగనన్న విద్యాకానుకను సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా 43 లక్షల మంది విద్యార్ధులకు మూడు జతల యూనిఫామ్‌, నోట్‌ బుక్స్‌, టెక్ట్‌ బుక్స్‌, ఓ జత షూస్‌, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ను ప్రభుత్వం అందజేయనుంది. ఇందుకోసం రూ. 648 కోట్ల రూపాయల విడుదలకు కేబినెట్‌ ఆమోదించింది.

పథకాల పందేరం....

పథకాల పందేరం....

సెప్టెంబర్‌ 1న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌, సంపూర్ణ పోషణ పథకాలను ప్రభుత్వం ప్రారంభించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ ప్లస్‌, మిగతా మండలాల్లో సంపూర్ణ పోషణ కింద గర్భవతులు, బాలింతలకు 6 నుంచి 36 నెలల వరకూ, అలాగే 36 నుంచి 72 నెలల పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందించనుంది. వీటి అమలు ద్వారా రాష్ట్రంలో 30 లక్షల మందికి రూ. 1863 కోట్ల రూపాయల లబ్ది చేకూరనుంది. అలాగే డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో బియ్యం కార్డు దారులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకానికీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ బియ్యాన్ని ఇళ్ల వద్దకే తీసుకొచ్చి బరువు కొలిచి మరీ ఇవ్వబోతున్నారు. బియ్యం పంపిణీకి వాడే వాహనాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను అందించబోతున్నారు. ఇలా 9260 వాహనాల కొనుగోలుకు 60 శాతం సబ్సిడీతో రుణాలు తీసుకునేందుకు సివిల్‌ సప్లైస్‌ కార్పోరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటితో ఆయా యువకులకు నెలకు పది వేలు ఆదాయం చేకూరనుంది. అలాగే వైఎస్సార్‌ సామాజిక భద్రత పథకాన్ని కూడా ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. దీని ప్రకారం 18 నుంచి 50 ఏళ్ల మధ్య సహజమరణానికి రూ.2 లక్షలు, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.5 లక్షలు బాధిత కుటుంబాలకు చెల్లిస్తారు. అలాగే 51 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారికి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.3 లక్షలు చెల్లిస్తారు. బియ్యం కార్డు ఉండి కుటుంబ సభ్యులు ప్రమాదాలకు కానీ మరణాలకు కానీ గురైతే వైఎస్సార్‌ బీమా కింద ఈ మొత్తం లభిస్తుంది. ఎల్‌ఐసీతో పాటు కేంద్రం కూడా గతంలో ఉన్న పథకాన్ని ఉపసంహరించడంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిదులతో దీన్ని అమలు చేస్తోంది.

 కొత్త ఉద్యోగాలు, ఖాళీల భర్తీ...

కొత్త ఉద్యోగాలు, ఖాళీల భర్తీ...

చిత్తూరు జిల్లా వెదురుకుప్పు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 26 టీచింగ్‌ పోస్టులు, 14 నాన్‌ టీచింగ్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్‌ పోస్టులు, 8 నాన్‌ టీచింగ్ పోస్టులకూ ఆమోదముద్ర పడింది. కడప జిల్లాలో 76 హోంగార్డు పోస్టులనూ ఆమోదించారు. మరోవైపు విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో రూ.510 కోట్లతో అదనంగా 115 మెగావాట్ల చొప్పున 2 యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో కొత్త పోలీసు సబ్‌ డివిజన్, కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించింది.

ఇండస్ట్రియల్‌ పాలసీకి ఒకే..

ఇండస్ట్రియల్‌ పాలసీకి ఒకే..

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2020 నుంచి 2023 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 2000 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీఐఐసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీబీడీఐసీ) ఏర్పాటుచేయనున్నారు. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు కోసం రైట్స్‌ కంపెనీ ఇచ్చిన డీపీఆర్‌ను కేబినెట్‌ ఆమోదించింది. ఏపీ అక్వాకర్చర్‌ సీడ్‌ యాక్ట్‌ సవరణ ఆర్డినెన్స్‌ను కూడా కేబినెట్‌ ఆమోదించింది. అలాగే రాష్ట్రంలో వ్యవసాయరంగంలో తాజా పరిస్ధితులపై మంత్రిమండలిలో చర్చ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+