ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ: చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలివే
అమరావతి: హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి తరలివచ్చే ఉద్యోగుల స్థానికత విషయంలో మార్గదర్శకాలను సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలోని సీఎం కార్యాలయంలో ప్రారంభమైన మంత్రవర్గ సమావేశం ముగిసింది.
సుమారు మూడున్నర గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు నిద్రాహారాలు మాని పనిచేసిన ఇంజనీర్లకు, అధికారులకు, నీటి పారుదల శాఖ సిబ్బందికి ఒక నెల జీతాన్ని ఇంక్రిమెంటుగా ఇవ్వాలని మంత్రిమండలి తీర్మానించింది.
బందరు పోర్టు నిర్మాణంలో భూ సమీకరణ విధానాన్నే అమలు చేయాలని, రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకునే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన వారికి అభివృద్ధి చేసిన భూమిలో వాణిజ్య, నివాస స్థలాలు కేటాయించేందుకు వీలు కల్పిస్తూ మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థకు భూసమీకరణ అధికారం కట్టబెడుతూ తీర్మానం చేశారు.

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వే విజయవంతం కావడానికి మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలకు వివిధ జిల్లాల్లో భూకేటాయింపులు చేస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపారు.
రాష్ట్రంలో ప్రైవేటు వర్శిటీలను ఏర్పాటు చేయాలని, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ప్రతిపాదిత ట్రిపుల్ ఐటీలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications