ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- భారీగా ప్రాజెక్టుల ఆమోదం-ముగ్గురు మంత్రులకు జగన్ ప్రశంసలు !
అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతే కాదు ఈ భేటీలో ముగ్గురు మంత్రుల పనితీరుపై సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు.
ఏపీలోని వెలగపూడి సచివాలయంలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటయ్యే పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్.. ఈ ఏడాది అమలు చేసే పలు పథకాలకు పచ్చజెండా ఊపింది. అలాగే రాష్ట్రంలో పలు సంస్ధల ఏర్పాటునూ ఆమోదించింది. దీంతో పాటు మండలాల విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీలో ముగ్గురు మంత్రుల్ని సీఎం జగన్ అభినందించారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో త్వరలో అందించే సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా ఈ నెల 10 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్...మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి తో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి తో ఎన్టీపిసి ప్రాజెక్టు కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఫేజ్ వన్లో 30 వేల మందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ మరియు సోలార్ పవర్ ప్రాజెక్ట్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.

కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
వైజాగ్ లో టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు కెబినెట్ ఆమోదం తెలిపింది. బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. 9.75 శాతం వడ్డీతో రూ.3940 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతిచ్చింది.
నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు కేబినెట్ అంగీకారం తెలిపింది. యూనిట్టుకు రూ. 2 చొప్పున రాయితీ ఇవ్వాలనీ నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కొత్తగా తాడేపల్లి గూడెం లో రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 500 మెగావాట్ల ఆదాని హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు తా మండలం లో 406 ఎకరాలు ఎకరాకు 5 లక్షల చొప్పున విక్రయం ప్రాతిపదికన కేటాయింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు డైరీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 106
కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది.

మండలాల విభజన
రాష్ట్రంలో పలు మండలాల్ని అర్బన్, రూరల్ గా విభజించేందుకు రాష్ట్ర కేబినెట్ ఇవాళ అనుమతి ఇచ్చింది. ఇందులో ఒంగోలు మండలాన్ని రూరల్, అర్బన్ మండలాలుగా విభజనకు ఆమోదం తెలిపారు. 6 జిల్లా కేంద్రాల మండలాలను గ్రామీణ, అర్బన్ మండలాల గా విభజనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఇందులో ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, అనంతపురం, చిత్తూరు మండలాలు అర్బన్, రూరల్ మండలాలుగా విభజనకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది.
ముగ్గురు మంత్రులకు జగన్ ప్రశంసలు
రాష్ట్ర కేబినెట్ భేటీలో ముగ్గురు మంత్రులకు సీఎం జగన్ ఇవాళ అభినందించారు. ఇందులో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్యశాఖ మంత్రి విడదల రజనీతో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. ముందు బొత్స, రజనీ శాఖల పనితీరుపై ప్రశంసలు కురిపించిన జగన్ .. అనంతరం ధాన్యం కొనుగోళ్లలో ముందున్న పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరినీ ప్రశంసించారు. చివర్లో కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత తాజాగా మృతిచెందిన పలువురు సినీ ప్రముఖులకు మంత్రులు నివాళులు అర్పించారు. ఇందులో కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్ సాగర్కు నివాళి అర్పిస్తూ కేబినెట్ మౌనం పాటించింది.












Click it and Unblock the Notifications