ఏప్రిల్ 4 నుంచి ఏపీ కొత్త జిల్లాలు -ముహుర్తం ఖరారు-కేబినెట్ ఆమోదం-రేపు నోటిఫికేషన్
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలపై సీఎం జగన్ మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో మార్పులకు కేబినెట్ వర్చువల్ గా ఆమోదం తెలిపింది. అలాగే ఈ మార్పుల ప్రకారం కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఉగాది నాడు ఏర్పాటు చేయాల్సిన జిల్లాలు రెండు రోజులు ఆలస్యంగా అమల్లోకి రానున్నాయి.
Recommended Video
కొత్త జిల్లాలు ఖరారు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం గతంలో ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ తర్వాత వచ్చిన అభ్యంతరాలపై ఇవాళ సీఎం జగన్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో మార్పులు, చేర్పులపై చర్చించారు. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లపైనా చర్చించారు. అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటును ఖరారు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ రేపు వెలువడనుంది.
కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు
ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వినతుల మేరకు కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లుఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పలాస, భీమిలి, బొబ్పిలి, చీపురుపల్లి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం,శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. వీటిని కూడా కొత్త నోటిఫికేషన్లో ప్రస్తావించనున్నారు.
కొత్త జిల్లాల అవతరణ ముహుర్తమిదే
కొత్త జిల్లాల ఏర్పాటు ఏప్రిల్ 2న ఉగాది నాడు ఉంటుందని భావించినా ప్రభుత్వం మాత్రం రెండు రోజులు ఆలస్యంగా ముహుర్తం ఖరారు చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 4న ఉదయం 9 గంటల 5 నిమిషాల నుంచి 9 గంటల 45 నిమిషాల మధ్య కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో కొత్త జిల్లాలు, కొత్తగా అవతరించిన రెవెన్యూ డివిజన్ల ప్రకారం అదే ముహుర్తానికి అమల్లోకి రాబోతున్నాయి.