విభజన: కెసిఆర్ లక్ష్యంగానే చంద్రబాబు మంత్రివర్గం
సమావేశానంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాటలను బట్టి, ఐటి మంత్రి పల్లే రఘునాథ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు లక్ష్యంగా ఆంధ్రప్రదేశఅ మంత్రివర్గ సమావేశం జరిగినట్లు అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు తయారీలో కెసిఆర్ కీలక పాత్ర పోషించారని, అవి తెలంగాణ వ్యతిరేకమైతే ఎందుకు అంగీకరించారని యనమల రామకృష్ణుడు అన్నారు. బిల్లు తెలంగాణకు వ్యతిరేకమైతే సంబురాలు ఎందుకు చేసుకున్నారని ఆయన కెసిఆర్ను ప్రశ్నించారు.
వివాదాలను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఇరు ప్రభుత్వాలపై ఉందని, వాటిని పరస్పర ఒప్పందం ద్వారా పరిష్కరించుకుందామని, దానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైఖరిని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ ప్రయోజనం కోసం విభజన అంశాలను కెసిఆర్ వివాదం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటోందని ఆయన విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
కెసిఆర్ విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఐటి మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విమర్శించారు. విజయనగరం జిల్లాలో పుట్టిన కెసిఆర్కు స్థానికత ఎలా వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన అన్నారు. న్యాయం చేయాలని తాము అడుగుతున్నామని, కెసిఆర్ కుదరంటున్నారని ఆయన అన్నారు. విభజన చట్టంలోని అంశాలపై కెసిఆర్ నిర్ణయాలు ఆక్షేపిణీయంగా ఉన్నాయని ఆయన అన్నారు.
అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో 24 గంటలు కరెంట్ ఇస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను అర్థవంతంగా, ప్రజోపయోగకరంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు - చెట్టు కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. కొన్ని ఆలయాల భూముల లీజు రేట్లు పెంచి మళ్లీ ఇస్తామని ఆయన చెప్పారు.