ఐదుగురు ఔట్, 11మంది ఇన్: వైసిపి నుంచి 4గురు, జ్యోతులకు షాక్, అఖిల శాఖ ఇదే!
ఏపీ మంత్రి వర్గానికి కొత్త రూపు వచ్చింది. పాత మంత్రుల్లో అయిదుగురికి ఉద్వాసన పలికి, కొత్తగా 11 మందికి చోటు కల్పించారు.
అమరావతి: ఏపీ మంత్రి వర్గానికి కొత్త రూపు వచ్చింది. పాత మంత్రుల్లో అయిదుగురికి ఉద్వాసన పలికి, కొత్తగా 11 మందికి చోటు కల్పించారు. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, రాజకీయ అవసరాలు, సమర్థత.. తదితరాలను పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు.. చివరకు తన కేబినెట్ను శనివారం రాత్రి ఖరారు చేశారు.
ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వవద్దని రామసుబ్బారెడ్డి సీఎం వద్ద మొర పెట్టుకున్నారు. కానీ ఆయనను బుజ్జగించి.. కడపలో ఎదిగేందుకు ఆయనకు అవసరమని చెప్పి ఆదిని కేబినెట్లోకి తీసుకున్నారు. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఉద్వాసన వీరికే
మంత్రులుగా ఉన్న బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి (చిత్తూరు), పల్లె రఘునాథ్ రెడ్డి (అనంతపురం), రావెల కిషోర్ బాబు (గుంటూరు), పీతల సుజాత (పశ్చిమ గోదావరి), కిమిడి మృణాళిని (విజయనగరం)లకు ఉద్వాసన పలికారు.

కొల్లు రవీంద్ర సేఫ్.. వారిని ఎందుకు తప్పించారంటే..
మంత్రి కొల్లు రవీంద్ర పేరు కూడా ఉద్వాసన జాబితలో కనిపించింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయన పదవిని కాపాడుకున్నారు. అలాగే, మత్స్యకార వర్గానికి ఓ పదవి ఉండాలని చంద్రబాబు కూడా భావించడం ఆయనకు కలిసి వచ్చింది.
అనంతపురంలో బీసీలకు ప్రాధాన్యత కల్పించేందుకు పల్లె రఘునాథ్ రెడ్డిని తప్పించవలసి వచ్చింది. మృణాళిని, రావెల, సుజాతలు అందరినీ కలుపుకొని వెళ్లకపోవడం వల్ల, విమర్శలతో పదవి కోల్పోవాల్సి వచ్చింది. బొజ్జలను ఆరోగ్య కారణాలతో తప్పించారని చెబుతున్నారు.

వీరు ఇన్..
మంత్రివర్గంలకి కొత్తగా కిమిటి కళా వెంకట్రావు (శ్రీకాకుళం), సుజయ కృష్ణ రంగారావు (విజయనగరం), పితాని సత్యనారాయణ (ప.గో.), జవహర్ (ప.గో), నక్కా ఆనంద్ బాబు (గుంటూరు), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (ఎస్పీఎస్ నెల్లూరు), నారా లోకేష్ (చిత్తూరు), అమర్నాథ్ రెడ్డి (చిత్తూరు), కాల్వ శ్రీనివాసులు (అనంతపురం), ఆదినారాయణ రెడ్డి (కడప), భూమా అఖిల ప్రియ (కర్నూలు)లకు చోటు కల్పించారు.

వైసిపి నుంచి నలుగురికి.. జ్యోతులకు షాక్
వైసిపి నుంచి వచ్చిన వారిలో నలుగురికి కేబినెట్లో చోటు దక్కింది.త సుజయ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అఖిల ప్రియలు వైసిపి నుంచి వచ్చారు. జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్, చాంద్ బాషా, డేవిడ్ రాజు వంటి పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఇంతకు మించి ఇవ్వడం కుదరకపోవడంతో పక్కన పెట్టరు.
మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిసి 26 మంది మంత్రులు ఉన్నారు. ఇప్పటి వరకు 19 మంది ఉండగా.. అయిదుగురికి ఉద్వాసన పలకగా 14కు వచ్చింది. ఆ తర్వాత 11 మందిని తీసుకున్నారు. దీంతో మొత్తం 25 మంది మంత్రులు అయ్యారు. సీఎంతో కలుపుకుంటే 26. ఏపీ కేబినెట్లో 26 మంది ఉండవచ్చు.
కాగా మొత్తం మంత్రులు 25 మంది కాగా.. టిడిపి వారు 19, వైసిపి నుంచి వచ్చిన వారికి 4గురు, ఇద్దరు బీజేపీ మంత్రులు ఉన్నారు. మండలి నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు. యనమల రామకృష్ణుడు, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారా లోకేష్.

ఎంతో కసరత్తు చేసిన చంద్రబాబు
ఆదివారం ఉదయం 9.22 గంటలకు వెలగపూడి సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన వేదికపై నుంచి వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. పనితీరు, వ్యవహారశైలి సహా మరికొన్ని ఇతర కారణాలతో అయిదుగుర్ని మంత్రివర్గం నుంచి తొలగించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014, జూన్ 8న ఏపీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశాక మార్పులు, చేర్పులు జరగటం ఇదే తొలిసారి.
దాదాపు మూడేళ్ల పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో.. రెండేళ్లలో జరగనున్న సాధారణ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు, తదనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాల్ని వేగంగా, సమర్థంగా అమలుచేసేందుకు ఈ పునర్వ్యవస్థీకరణని ఉద్దేశించారు. మంత్రివర్గానికి సరికొత్త రూపమిచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన కసరత్తే చేశారు.

శాఖల మార్పు
మంత్రివర్గంలో విస్తృత రీతిలో మార్పులు, చేర్పులు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల శాఖల్ని సైతం మార్చనున్నారు. ఇప్పటికే ఈ మేరకు మంత్రులకు సంకేతాలిచ్చారు కూడా. అసెంబ్లీలో అధికార పక్ష వాణిని బలంగా వినిపించిన అచ్చెన్నాయుడు వంటి వారికి కీలక శాఖ ఇచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు ఆయన చూస్తున్న యవజన సంక్షేమ శాఖను కొత్తగా మంత్రివర్గంలోకి వస్తున్న అఖిలప్రియకు కేటాయించవచ్చని భావిస్తున్నారు. లోకేష్కి గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు సంబంధించిన శాఖలిచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications