'తల్లికి వందనం' అమలు వారికే - తాజా నిర్ణయం, మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. వచ్చే నెల మే లో తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయిం చింది. అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ 20 వేలు జమ చేయాలని నిర్ణయించింది. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో పథకాలతో పాటుగా అమరావతి పనుల ప్రారంభం.. ప్రధాని రాకతో సహా పలు కీలక అంశాల కు ఆమోద ముద్ర వేయనున్నారు.
కీలక నిర్ణయాలు
ఈ రోజు (గురువారం) ఏపీ మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో డ్రోన్ పాలసీపై పలు సంస్థలకు భూకేటాయింపులపై చర్చతో పాటుగా నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతిలో పలు పనులకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే అమరావతిలో పనుల ప్రారంభానికి వీలుగా టెండర్లను ఖరారు చేసారు. పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల మూడో వారంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటన కు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు రుణం తొలి విడత నిధులు విడుదల అయ్యాయి. దీంతో, అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటుగా నిర్ణయాల పైన చర్చించనున్నారు.

తల్లుల ఖాతాల్లో నిధులు
ఇక, ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామకం పూర్తి చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి మంత్రివర్గ భేటీలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ తేది పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా వచ్చే నెలలో తల్లికి వందనం పథకం అమలును కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్ లో నిధులు కేటాయించారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ 15 వేలు చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా, ఇప్పటికే ఈ పథకం అమలుకు వీలుగా అర్హతలు.. మార్గదర్శకాల పైన కసరత్తు కొనసాగుతోంది.
మార్గదర్శకాలు
2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యా ర్ధులు చదువు తున్నారు. అయితే ఇందులో ప్రాధమికంగా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హు లుగా విద్యా శాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇందు కోసం దాదాపు రూ 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. ఆదాయ పన్ను చెల్లింపు దారులు..తెల్లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధన లను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications