AP Cabinet: ఏపీ మంత్రివర్గ కీలక భేటీ..!
ఏపీ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు దీనికి హాజరుకానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. పలు ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. అలాగే దాదాపుగా 50కి పైగా అంశాలను మంత్రివర్గం చర్చించనుంది. వాటికి సంబంధించిన కొన్ని తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది.
చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిర్వహించిన దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దావోస్ పర్యటన వివరాలు, వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి ఈ సందర్భంగా చంద్రబాబు.. మంత్రులకు వివరిస్తారని తెలుస్తోంది. పెట్టుబడులతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కీలక నిర్ణయాలపై మంత్రి వర్గం చర్చించనుంది.

పలు సంస్థలకు భూకేటాయింపుల గురించి మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని తీర్మానాలను మంత్రులు ఆమోదిస్తారని చెబుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, తేదీల ఖరారుపై సూచన ప్రాయ నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. సాయంత్రం 4 గంటలకు రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తారు చంద్రబాబు.
రాజధాని అమరావతి పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, నీటిసరఫరా పనుల ప్యాకేజీకి ఇదివరకే కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పనుల గురించి మంత్రివర్గం చర్చించే అవకావం ఉంది. విశాఖపట్నంపై ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. వివిధ పారిశ్రామిక సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండటంతో వారికి భూముల కేటాయింపుపై చర్చిస్తారని సమాచారం. రహదారుల అభివృద్ధితో పాటు వివిధ కార్యక్రమాలతో చంద్రబాబు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 29న చంద్రబాబు అరకులో పర్యటిస్తారు. 30, 31 తేదీల్లో కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications