ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్టా?: బెజవాడలో కేబినెట్ భేటీ, అమరావతికి మారాల్సిందే
విజయవాడ: మంత్రివర్గ సమావేశాలు విజయవాడలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 31వ తేదీన జరిగే కేబినెట్ సమావేశం విజయవాడ వేదికగా జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రభుత్వం వైఖరిలో మార్పు వచ్చిందని చెబుతున్నారు.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాత్కాలిక రాజధానికి తరలి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. పాలన అక్కడి నుంచే చేసేందుకు కసరత్తు చేస్తోంది.
కాగా, ప్రభుత్వ కార్యకలాపాలను సాధ్యమైనంత మేరకు రాజధాని అమరావతి సమీపం నుంచే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక నెల రోజుల్లో ప్రజలతో సంబంధమున్న అన్ని శాఖలను అక్కడికి తరలించాలని భావిస్తున్నారు.

ప్రజలకు దగ్గరగా ఉండి పాలన సాగించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు, విభాగాల తరలింపుపై మంగళవారమిక్కడ సచివాలయంలో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఏర్పాట్ల కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కమిటీలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, రహదారులు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ సీఆర్డీఏ, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ అందుబాటులోని తాత్కాలిక వసతి ప్రాంతాలను గుర్తించనుంది. వెంటనే అక్కడికి కార్యాలయాల్ని తరలించేందుకు అవకాశాల్ని పరిశీలించనుంది. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
రాజధాని నిర్మాణానికి ప్రత్యేక శాఖ
రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారాల్ని ఒక ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ (ఐ అండ్ ఐ)కి జత చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోంది.
రెండు విభాగాలూ పెట్టుబడుల్ని ఆకర్షించటం, ప్రాథమిక వసతుల్ని కల్పించటం, రహదారుల్ని నిర్మించటం, ప్రైవేట్ సంస్థలతో కలిసి భారీ ప్రాజెక్టుల్ని చేపట్టటం పైనే ప్రధానంగా పని చేస్తాయి కనుక వీటిని కలిపి ఒకే సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ వర్గాల్లో ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications