నేననుకుంటే నా ఇంటి ముందే రాజధాని: చంద్రబాబు
విజయవాడ: తాను స్వార్థంగా ఆలోచించివుంటే చిత్తూరులోని తన ఇంటిముందే రాజధాని, కార్యాలయం ఉండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఏపి రాజధాని ప్రాంతంలోని తూళ్ళూరు, మంగళగిరి రైతులు చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రాంతంలో రాజధాని నిర్మించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తూ చంద్రబాబును గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండాలనే విజయవాడ-గుంటూరు పరిసరాల్లో రాజధాని నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. తాను స్వార్థంగా ఆలోచించివుంటే చిత్తూరులోని తన ఇంటి ముందే రాజధానిని నిర్మించుకునే వాడినని చెప్పారు. తన ఇంటిముందే సిఎం కార్యాలయం కూడా ఉండేదని చెప్పారు. కానీ, తాను అలా స్వార్థంతో ఆలోచించలేదని చెప్పారు.
రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు ఇక్కడి రైతులు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. రాజధానితో ఇక్కడి రైతులు, ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారని చెప్పారు. రాజధాని కొన్ని పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆరోపించారు.
అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉన్నందునే ఈ ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మధ్యలోనే రాజధాని ఉండాలని అన్నారు. రాజధానితో ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని చెప్పారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశానని, పెద్ద ఎత్తున ఆదాయం రావడం వల్లే తెలంగాణ రాష్ట్రం 16వేల కోట్ల మిగులు బడ్జెట్లో ఉదని.. ఏపి 16వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందని తెలిపారు.

మారుమూల ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడం అభివృద్ధి జరగదని చంద్రబాబు అన్నారు.
రాజధాని విషయంలో తన ప్రకటనపై అడ్డుపడేందుకు కొన్ని పార్టీలు కుట్రలు చేశాయని తెలిపారు. తాను ఏదైనా ఒక్కసారి అనుకుంటే చేసి తీరానని అన్నారు. రాష్ట్రం విడిపోయి సంక్షోభంలో మనకు రాజధాని నిర్మించుకునే అవకాశం లభించిందని అన్నారు.
ఈ రోజు కట్టాల్సిన రాజధాని వెయ్యి సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకునేలా నిర్మిస్తామని చంద్రబాబు అన్నారు. అలా చేయకపోతే బావి తరాలు క్షమించవని చెప్పారు. ఇంతకుముందు ఇక్కడి నుంచి చాలా మంది ఉపాధి కోసం అమెరికాకు వెళ్లారని.. రాజధాని నిర్మాణం తర్వాత అందరూ ఇక్కడికే వస్తారని అన్నారు. రాజధాని రావడంతో ఈ ప్రాంతంలోని పెళ్లికాని అబ్బాయిలను వెతుక్కుంటూ వస్తున్నారని చెప్పారు. చరిత్రలో ఇవ్వని ప్యాకేజీని ఇప్పుడు ఇచ్చానని చెప్పారు.
రైతులు, ప్రజలు లాభ పొందాలనేదే తన కోరిక అని చంద్రబాబు చెప్పారు. అవసరమైతే ఎక్కువ సమయం కష్టపడతానని చెప్పారు. తూళ్లూరు, మంగళగిరి రైతులకు అన్యాయం జరగనివ్వమని అన్నారు. కొన్ని పార్టీలకు తాము చేసేది అర్థంకాక విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి రైతులను, ప్రజలను చెడగొట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.
రైతులు, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని చెప్పారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు. ఏం చేసిన ఇక్కడి ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్కు డబ్బులు, ప్రణాళిక కావాలన్నారు. సింగపూర్ ప్రతినిధులు రాజధాని నిర్మాణంలో సహకరించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. తాను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications