వాలంటీర్లు జోక్యం చేసుకుంటే అంతే- ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!!
ఏపీ పాలనా వ్యవస్థలో కీలకంగా మారిన వాలంటీర్లకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత సచివాలయ - వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే, గత ఏడాది కాలంగా ఏపీలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వాలంటీర్లను ఎన్నికల్లో వినియోగించుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్లే అధికార పార్టీ ఏజెంట్లుగా పోలింగ్ బూత్ ల్లో వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి.
ఏజెంట్లుగా అనుమతి లేదు
దీంతో..ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఏ అభ్యర్థి తరుఫునా పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించవద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఎన్నికల రోజున ఓటరు చీటీల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, పోలింగ్ విధులు, ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన విధుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని స్పష్టం చేసారు.
ఉప ఎన్నికల్లో ఫిర్యాదులు
క్షేత్రస్థాయిలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదని ఆదేశాల్లో తేల్చి చెప్పారు. బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికలతో పాటు అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీరంతా బహిరంగంగానే వైసీపీ అభ్యర్దులకు మద్దతుగా వ్యవహరించారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో పాటుగా కొందరు అధికార పార్టీ నేతలు సైతం వాలంటీర్లు తమ పార్టీ మనుషులు..వైసీపీకి చెందిన వారికే వాలంటీర్ పోస్టులిచ్చామంటూ చేసిన వ్యాఖ్యలను ఆధారాలుగా తమ ఫిర్యాదులకు జత చేశారు.
వాలంటీర్ల ప్రమేయం వద్దంటూ ఆదేశాలు
వీటిని పరిశీలించిన తరువాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదేశాలను అమలు అయ్యేలా చడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాల్లో స్పష్టం చేసారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నేరుగా సంబంధాలు ఉన్న వాలంటీర్లు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనటం ద్వారా ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో..రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తరువాత సీఈఓ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.