ఎపిలో వర్చువల్ క్లాస్లు: పిల్లలకు చంద్రబాబు పాఠాలు
అమరావతి: హైటెక్ సిఎంగా గుర్తింపుపొందిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టారు అవతారం ఎత్తారు. విద్యార్థులకు పాఠాలు చెప్పారు, వాళ్లతో కలిసి తాను కూడా పాఠాలు విన్నారు. ఈ ఆసక్తికరమైన ఘట్టాలన్నీ రాజధాని పరిధిలోని ఓ పాఠశాలలో వర్చువల్ క్లాస్ రూమ్(విసిఆర్) ప్రారంభోత్సవం సందర్భంగా జరిగింది.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్రంలో 4 వేల పాఠశాలల్లో వర్చువల్ క్లాస్రూమ్స్ వ్యవస్థను రూ.120 కోట్లతో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఫైలెట్ ప్రాజెక్ట్ గా రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్లో విసిఆర్ తరగతి గదులను ముఖ్యమంత్రి చంద్రబాబు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు.
విద్యార్ధులకు చంద్రబాబు పాఠాలు..
అనంతరం వర్చువల్ క్లాస్రూమ్ తరగతి గదిలో విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి పాఠాల బోధన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ వీసీఆర్ తరగతుల వల్ల ఉపయోగాలు ఏమిటి? మామూలు తరగతుల గదులకు, ఈ తరగతి గదుల ద్వారా బోధించే పాఠ్యాంశాలలో వ్యత్యాసం తెలుసుకున్నారా అని విద్యార్ధులను ప్రశ్నించి ముఖ్యమంత్రి చంద్రబాబు వారి అభిప్రాయాలను రాబట్టారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందించాలని రాష్టవ్య్రాప్తంగా వివిధ స్కూళ్లలో వర్చువల్ క్లాస్ రూం తరగతుల గదులను దృశ్యమాధ్యమం ద్వారా అందిస్తున్నామన్నారు. ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి పాఠ్యాంశ బోధనలను చేపడతామన్నారు. ఒక చోట ఉపాధ్యాయుడు బోధిస్తే రాష్ట్రంలోని అన్ని వర్చువల్ క్లాసుల్లో విద్యార్థులు లైవ్ ద్వారా పాఠాలు వినే అవకాశం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ప్రతి పాఠశాల పరిధిలో ఎన్ని వీసీఆర్ తరగతి గదులు నిర్వహించాలో అధికారులు ప్రతిపాదనలు రూపొందించి కార్యాచరణ ప్రణాళికలను అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
41 ఎడ్యుకేషన్ స్టూడియోలు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 వేల పాఠశాలల్లో వీసీఆర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి ఈ పాఠాలను దృశ్యమాధ్యమం ద్వారా అందిస్తున్నామని, త్వరలో గుంటూరు నుంచే మొత్తం సిస్టమ్ను ఆపరేట్ చేస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో 41 స్టూడియోలను ఏర్పాటుచేసి, ప్రతి స్టూడియోలోనూ పది మంది ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు. వీసీఆర్ తరగతి గదులను ఎసి గదులుగా రూపుదిద్దాలని చంద్రబాబు తెలిపారు. కొత్తవి నేర్చుకోవాలనే ఉత్సాహం విద్యార్థుల్లో నెలకొల్పడానికి వీసీఆర్ తరగతి గదులు ఎంతగానో దోహదపడతాయన్నారు. 30 తరగతి గదుల విద్యార్థులకు ఒక్కొక్క టీచరును కేటాయించి బోధనా బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు వచ్చే సందేహాలను కంప్యూటరీకరణ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లోని ఉపాధ్యాయులకు వాటి వివరాలను ఎప్పటికప్పుడు అందజేస్తామన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో...
విద్యాబోధనలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రథమస్థానం కల్పిస్తూ రాష్ట్రాన్ని ప్రథమస్థానంలో నిలవడమే కాకుండా వినూత్నమైన ప్రయోగాలకు కేంద్రంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులందరూ బాగా చదవాలనే ఉద్దేశంతో, ప్రయోజనం కలగాలనే వీసీఆర్ తరగతి గదులను ప్రోత్సహిస్తున్నామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల వివరాలను వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఓ యాప్ను కూడా రూపొందిస్తున్నామని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.