సీఎస్..రెడీ ఫర్ యాక్షన్! వరుస సమీక్షలతో దూకుడు
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక మిగిలింది మూడు రోజుల వ్యవధి మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలను స్వీకరించారు సీనియర్ ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా సమీక్షలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఆదివారం సెలవురోజైనప్పటికీ.. ఆయన విశ్రాంతి తీసుకోలేదు. సమీక్షా సమావేశాలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయి అధికారులకు 145 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సహా వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
ఛాన్స్ వస్తే చంద్రబాబు మళ్లీ బీజేపీతో జట్టు! కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ సర్కార్! చక్రం తిప్పేది వారే
తనిఖీలను ముమ్మరం చేయండి:
రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం చోటు చేసుకునే పరిణామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ప్రచారం ముగిసిన అనంతరం పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం, ఇతర గృహోపకరణాలను ఎరగా చూపించి, ఓటర్లను ప్రలోభానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఓటర్లను ఎవరు ప్రలోభాలకు గురి చేసినా.. ఉపేక్షించ వద్దని అన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో స్వేచ్ఛగా వ్యవహరించాలని, ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గాల్సిన అవసరం లేదని చెప్పారు. తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. అవసరమైతే చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలని, సిబ్బందిని కూడా పెంచుకోవాలని సూచించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు..
రాష్ట్రంలో అత్యంత సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండే పోలింగ్ కేంద్రాలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆయన డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన ఠాకూర్ ను అడిగి తెలుసుకున్నారు. సమస్మాత్మక, సున్నిత ప్రాంతాలకు సంబంధించిన నివేదికను అందజేయాలని కోరారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను ఇవ్వాలని అన్నారు. జిల్లా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, పారా మిలటరీ సిబ్బందిని విధి నిర్వహణలో ఉపయోగించబోతున్నామని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఏఏ ప్రాంతాలకు అదనపు బలగాలు అవసరమౌతాయో తెలియజేయాలని అన్నారు. అక్కడి ప్రాంతాలను బట్టి.. సిబ్బంది సంఖ్యను పెంచాలని చెప్పారు.
ఈవీఎంల తరలింపుపై డేగకన్ను..
పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు మొదలుకుని, పోలింగ్ ముగిసిన తరువాత వాటిని నిర్దేశిత ప్రాంతాలకు తరలించేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలింగ్ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యోదంతాల అనంతరం మావోయిస్టుల కదలికలు తీవ్రం అయ్యాయనే సమాచారం ఉందని, అలాంటి ప్రాంతాలపై అనుక్షణం నిఘా వేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
9000 సమస్యాత్మక కేంద్రాలు..
ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేదీ మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిది వేల వరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. చాలామటుకు జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచబోతున్నామని చెప్పారు. దీనికి సంబంధించి.. ఇదివరకే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిందని ద్వివేది తెలిపారు. 46,397 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 4,619, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 2,304 అదనపు పోలింగ్ కేంద్రాలను నెలకొల్పబోతున్నామని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా పోలీసులు ఉంటారని అన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామని అన్నారు. వీడియోలు తీస్తామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా నియమించడానికి చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ద్వివేదీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.