Margadarsi : మార్గదర్శి చందాదారులకు సీఐడీ నోటీసులు ! ఎవరెవరికంటే ?
ఏపీలో మార్గదర్శి కేసు ఇవాళ మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకూ మార్గదర్శి కేసులో ఎండీ శైలజా కిరణ్, రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుకు నోటీసులు జారీ చేసి విచారణ చేసిన సీఐడీ అధికారులు ఇవాళ చందాదారులకు కూడా నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో మార్గదర్శిలో చిట్స్ కు చందాలు కట్టిన వారు కూడా చిక్కుల్లో పడినట్లయింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి చిట్స్ వేసిన వారికి సీఐడీ నోటీసులు షాకిస్తున్నాయి.
మార్గదర్శి కేసు దర్యాప్తులో భాగంగా కోటి రూపాయలకు పైగా నగదు రూపంలో చందాలు కట్టిన చందాదారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు సీఐడీ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిబంధనల్ని ఉల్లంఘించి కోటి రూపాయలకు మించి నగదుతో చిట్స్ వేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సీఐడీ తెలిపింది. ఇలా కోటి రూపాయలకు పైగా చిట్స్ వేసిన వ్యక్తిగత చందాదారులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది.

కోటి రూపాయలకు పైగా నగదు రూపంలో చిట్స్ వేసిన చందాదారుల లావాదేవీల చట్టబద్ధతను నిర్ధారించుకునేందుకు వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సీఐడీ ప్రకటించింది. మనీలాండరింగ్, ఆర్ధిక అక్రమాలు, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఆర్బీఐ, సీబీడీటీ జారీ చేసిన నిబంధనల ఆధారంగానే ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. దేశంలో నగదు లావాదేవీల చట్టబద్ధతను నిర్దారించుకునేందుకు ఆర్బీఐ ఈ నిబంధనలు పెట్టినట్లు సీఐడీ చెబుతోంది. సీబీడీటీ సైతం తాజాగా ఇలాంటి మార్గదర్శకాలనే జారీ చేసిందని గుర్తుచేసింది.
ఇలా కోటి రూపాయలకు పైగా నగదు లావాదేవీలతో చిట్స్ కొని నోటీసులు అందుకున్న చందాదారులు తమ విచారణకు సహకరించాలని సీఐడీ కోరింది. అక్రమాలకు పాల్పడిన వారిని పట్టించేందుకు వీలుగా వారు సీఐడీకి సహకరించాలని కోరారు. ప్రజాప్రయోజనాల పరిరక్షణకు, ఆర్ధిక అక్రమాల నియంత్రణకు సీఐడీ కట్టుబడి ఉందని ఈ ప్రకటనలో తెలిపింది. మార్గదర్శి కేసులో నిష్పాక్షిక దర్యాప్తు చేసి చర్యలు తీసుకునేందుకు సీఐడీ కట్టుబడి ఉందన్నారు. సీఐడీ ఛీఫ్ సంజయ్ అనారోగ్యంతో తప్పుకోవడంతో ఆయన స్ధానంలో బాధ్యతలు చేపట్టిన పీఎస్ఆర్ ఆంజనేయులు పేరుతో ఈ ప్రెస్ నోట్ విడుదలైంది.












Click it and Unblock the Notifications