టీడీపీ నేతలకు ఐటి ఉచ్చు: ఇన్ సైడర్ ట్రేడింగ్ నేతలపై సీఐడి ఫిర్యాదు: సీబీఐకీ అప్పగిస్తారా..!
అమారావతి భూముల కొనుగోలు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. విపక్షంలో ఉన్న సమయం నుండి రాజధాని పేరుతో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో దీని పైన ప్రకటన చేసిన ప్రభుత్వం..ఎవరెవరు ఏ మేర భూములు కొనుగోలు చేసిందీ వివరించారు. ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ విచారణ చేయించింది. సీఐడీ విచారణలో లభ్యమైన సమా చారం ఆధారంగా అక్కడ భూములు కొనుగోలు చేసిన వారి వివరాలను ఆదాయపు పన్ను శాఖకు పంపాలని నిర్ణయించారు. అదే విధంగా..ఇనసైడర్ ట్రేడింగ్ పైన సీబీఐ లేదా లోకాయుక్తకు విచారణ బాధ్యతల ను అప్పగించటం పైన సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ఇప్పుడు ఇందులో ఉన్న టీడీపీ నేతల పేర్లు ఐటికి ఇస్తుండటంతో..వారికి ఉచ్చు బిగుసుకొనే ఛాన్స్ ఉంది. మరి ..దీనిని టీడీపీ ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
నిప్పుల్లో నివేదికలు: భోగి మంటల మధ్య అమరావతి నిరనసలు: చంద్రబాబు సహా...!
ఇన్ సైడర్ ట్రేడింగ్ నేతలపై ఐటీకి సీఐడి ఫిర్యాదు..
రాష్ట్ర విభజన తరువాత అమరావతిలో రాజధాని ఆలోచనును ముందుగానే తన సంబంధీకులకు లీక్ చేసి..వారు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి ఆర్దికంగా లాభ పడేలా చంద్రబాబు వ్యవహరించారని వైసీపీ ఎప్పటి నుండో ఆరోపిస్తోంది. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత దీని పైన సీఐడి విచారణ చేయించింది. అందులో కొందరు టీడీపీ నేతలు అక్కడ 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 30 మధ్య అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారి పైన సీఐడీ ఆరా తీసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుండి అసెంబ్లీలో రాజధానిని అధికారికంగా ప్రకటించే సమయం వరకూ ఆ ప్రాంతం లో జరిగిన భూ లావాదేవీల వివరాలను సేకరించింది. అందులో కొందరు టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యుల పేర్లతో..మరి కొందరు బినామీ పేర్లతో కొనుగోలు చేసారనేది ప్రభుత్వ వాదన.ఇప్పటికే దీని పైన టీడీపీ సైతం విచారణకు సిద్దమని ప్రకటించింది. దీంతో..సీఐడీ ద్వారా సేకరించిన నేతల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.
పలువురు టీడీపీ నేతల పేర్లు ప్రస్తావన..
అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ఆర్దిక మంత్రి బుగ్గన ఇదే వ్యవహారంలో పలువురు టీడీపీ నేతల పేర్లు ప్రస్తావించారు. దీనికి టీడీపీ నేతలు సైతం స్పందించారు. తక్కువ ధరలకే భూములు దక్కించు కున్నారంటూ హెరిటేజ్ సంస్థ గురించి ప్రభుత్వం సభలో ప్రస్తావించింది. ఇక, మాజీ మంత్రులు లోకేశ్ బినామీలంటూ కొందరి పేర్లు బయటకు తెచ్చింది. అదే విధంగా మాజీ మంత్రి యనయల అల్లుడుజజ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, దేవినేని, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత వంటి వారు ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు.. కొమ్మాలపాటి శ్రీధర్..తెలంగాణ నేత వేం నరేందర్ రెడ్డి వంటి వారి పైన ఆరోపణలు చేసింది. ఆదాయపు పన్ను చెల్లించకుండా నల్లధనంతో భూములు కొనుగోలు చేసారనేది తాజా అభియోగం. ఈ వ్యవహారం పైన చర్యల కోసం ఐటీ శాఖకు నివేదిక పంపాలని సీఐడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తుందా..
గత నెల 27న జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. దీని పైన న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని సీబీఐ లేదా లోకాయుక్త కు విచారణకు అప్పగించాలని ప్రతిపాదించారు. అయితే, ఇప్పుడు ఇందులో ఆర్దిక అంశాలు సైతం ముడి పడి ఉండటంతో సీబీఐకి ఇవ్వాలని మంత్రులు ప్రతిపాదిస్తున్నారు. దీని పైన కేంద్రంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ అంశం పైన విచారణ ఏ సంస్థకు అప్పగించాలనే దాని పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.