గోరంట్ల మాధవ్ వీడియోపై సీఐడీ కీలక ప్రకటన-యూఎస్ ల్యాబ్ రిపోర్ట్ ఫేక్-రాజమౌళి పులులూ నిజమే
ఏపీలో సంచలనం రేపుతున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంలో సీఐడీ ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఇందులో మాధవ్ వీడియో లీక్, అనంతరం దీనిపై ఎస్పీ ప్రకటన, యూఎస్ ల్యాబ్ రిపోర్ట్ వంటి అంశాలపై సీఐడీ బాస్ సునీల్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అదే సమయంలో వీడియో పీటముడి మరింత బిగుసుకున్నట్లయింది.
మాధవ్ వీడియో రచ్చ
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలో ఓ మహిళతో మాట్లాడుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో మాధవ్ నగ్నంగా నిలబడి ఓ మహిళతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అయితే ఇది ఒరిజినలా లేక మార్ఫింగా అన్న చర్చ మొదలైంది. దీనిపై వెంటనే స్పందించిన మాధవ్.. ఇది మార్పింగ్ వీడియో అంటూ తేల్చేశారు. తర్వాత అనంతపురం ఎంపీ ఫకీరప్ప ప్రెస్ మీట్ పెట్టి ఇది ఒరిజినల్ వీడియో కాదని తేల్చేశారు. దీంతో ప్రభుత్వం కూడా మాధవ్ వ్యవహారాన్ని లైట్ తీసుకుంది. కానీ విపక్షాలు మాత్రం వదల్లేదు.
యూఎస్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్
మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడానికి ముందే పోలీసులు దాన్ని ఒరిజినల్ కాదని నిర్దారించేశారు. దీంతో ఒరిజినల్ కాని వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎలా పంపుతామంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో విపక్ష టీడీపీ నేతలు.. యూఎస్ లోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు దీన్ని పంపారు. అక్కడి నుంచి వచ్చిన నివేదికలో ఇది ఒరిజనల్ అని బయటపడినట్లు టీడీపీ నేత పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. దీంతో పాటే ల్యాబ్ రిపోర్ట్ ను కూడా మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు. దీనిపై సీఐడీ దృష్టిసారించింది.
యూఎస్ ల్యాబ్ రిపోర్ట్ ఫేక్ అంటున్న సీఐడీ
గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజనలే అంటూ టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ పై సీఐడీ తాజాగా స్పందించింది. దీని ప్రామాణికతపై ల్యాబ్ కు లేఖ రాసి వివరాలు తెప్పించింది. ఇందులో ఆ రిపోర్ట్ నిజం కాదని తేలినట్లు సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయినా అమెరికాలోని ఓ ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికమని ఆయన ప్రశ్నించారు. దానిని తాము గుర్తించ బోమన్నారు. జిమ్ క్లిఫోర్డ్ ఇచ్చిన ధృవీకరణ పత్రం కూడా అసలైనది కాదన్నారు. దీన్ని స్వయంగా జిమ్ క్లిఫర్డ్ ఆ అంశాన్ని ధృవీకరించారని సీఐడీ బాస్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిమ్ క్లిఫార్డ్ కు సీఐడి తరపున లేఖ రాశామని, ఆయన నుంచి జవాబు కూడా వచ్చిందన్నారు. తానిచ్చిన రిపోర్ట్ అసలైంది కాదనీ ఈమెయిల్ ద్వారా తెలిపారన్నారు. నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ లో మార్పు చేర్పులు చేస్తే ఇక దానికి ప్రామాణికత ఎక్కడుందని ప్రశ్నించారు. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ ఇచ్చిన నివేదిక ఒరిజినల్ కాదనీ సీఐడీ కి పంపిన లేఖలో వెల్లడించారు. ఫోన్ లో ప్లే అయిన వీడియో గురించి ఎలాంటి అభిప్రాయాన్ని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ తెలియజేయలేదన్నారు.
రాజమౌళి సినిమాలో పులులూ ఒరిజనలే..
యూఎస్ ల్యాబ్ రిపోర్ట్ లో మార్పులు జరిగాయని, కాబట్టి దానికి ప్రామాణికత లేదని సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ఇవాళ తేల్చేశారు. రాష్ట్రంలో ఒక వీడియో కాల్ వైరల్ అయ్యిందని, ఓ పురుషుడు - మహిళ మధ్య జరిగిన వీడియో కాల్ ను వేరొకరు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని ఆయన తెలిపారు. ఎంపి గోరంట్ల మాధవ్ ఆ వీడియోలో ఉన్నట్టు గా కొందరు ఆరోపణలు చేశారని, వీడియోలో మాట్లాడుకున్న దానిని వేరే ఫోన్ లో రికార్డు చేసి పంపారని ఆయన వెల్లడించారు. రాజమౌళి సినిమా లో పులులు సింహాలు ను ఫోన్ ద్వారా తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే అది ఒరిజినల్ గానే చెబుతారన్నారు. కాబట్టి మహిళ - పురుషుడి మధ్య జరిగిన వీడియో సంభాషణను తనిఖీ చేస్తే మాత్రమే అది ఆలైనదా లేక మార్ఫింగ్ చేశారా అని చెప్పగలమని సునీల్ కుమార్ తెలిపారు. ఒరిజినల్ వీడియో క్లిప్ లేకుండా దానిని ఎలా తనిఖీ చేయగలమని ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ వీడియో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది.